12న ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నవంబరు 12వ తేదీన తెలంగాణలో పర్యటించబోతున్నారు. పెద్దపెల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. కేంద్ర ఎరువుల, రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ ఆర్ఎఫ్సీఎల్ యూనిట్లో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
ఆర్ఎఫ్సీఎల్ గతేడాది మార్చి 22న వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్టుగా ప్రకటించింది. ఇక, గతంలో మూత బడిన రామగుండం ఎఫ్సీఐ (ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంది. కొంతకాలంగా ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్న సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రధాని తాజా పర్యటకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అధికారిక కార్యక్రమంలో కూడా పాల్గొనకపోతే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో పాల్గొనే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పష్టతనివ్వలేదు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే టీఆర్ ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని కేటీఆర్ తోపాటు ఇతర నేతలు ఆరోపిస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత పెంచింది. రాజకీయంగా యుద్ధ వాతావరణం నెలకొన్ని తరుణంలో కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదంటున్నారు.