ప్రియాంక గాంధీ కీలక భేటీ : రేవంత్ - కోమటిరెడ్డి హాజరు : తేల్చేస్తారా.!!
తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. నేరుగా ప్రియాంక గాంధీ తెలంగాణ వ్యవహారాల పైన ఫోకస్ పెట్టారు. ఢిల్లీ రావాల్సిందిగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారు. ఢిల్లీలో ఈ సాయంత్రం ప్రియాంక పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ సీనియర్లు వర్సస్ రేవంత్ అన్నట్లుగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రియాంక ఆపరేషన్ మొదలు పెట్టారు. అందులో భాగంగా మునుగోడు ను అటు టీఆర్ఎస్.. బీజేపీ ఇప్పటికే సభలు నిర్వహించి..సత్తా చాటుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.

ప్రియాంకా గాంధీ కీలక భేటీ
దీంతో..కాంగ్రెస్ ఇప్పుడు మనుగోడు అభ్యర్ధి ఖరారు చేయటంతో పాటుగా రాజకీయంగా కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఇదే సమయంలో రేవంత్ పైన విమర్శలు చేస్తున్న నేతలను ఈ సమావేశానికి పిలిచారు. ఈ రోజు సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు నల్లగొండ జిల్లా ముఖ్య నాయకులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి హాజరు కానున్నారు. పార్టీ నేతలంతా బహిరంగ విమర్శలు.. ఫిర్యాదులు మాని.. ఉప ఎన్నిక పైన ఫోకస్ పెట్టాలని ప్రియాంక సూచించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో సమన్వయం చేసుకోవటంలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ కు దిశా నిర్దేశం చేస్తారని చెబుతున్నారు.

మునుగోడులో ప్రియాంక సభ
మునుగోడు ఉప ఎన్నిక అంశమే ఈ భేటీలో ప్రధాన ఎజెండాగా ఉంటుందని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక, కాంగ్రెస్ పరిస్థితిపై పార్టీ ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించింది. బీసీ అభ్యర్థిని బరిలోకి దింపితే ఫలితం ఉంటుందని, అదే సమయంలో పాల్వాయి స్రవంతికి కూడా ప్రజల్లోకి వెళ్లగలిగే సామర్థ్యం ఉందనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. సర్వేల ఆధారంగా మునుగోడు అభ్యర్థిపై టీపీసీసీ నేతలు కసరత్తు చేశారని, సోమవారం జరిగే భేటీలో తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తారని తెలుస్తోంది. అందరి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం మునుగోడులో గెలుపు తెలంగాణ నేతల సమిష్టి బాధ్యతని స్పష్టం చేయడంతో పాటు, ఈ మేరకు వెంటనే కార్యరంగంలో దిగాల్సిందిగా ప్రియాంక గాంధీ దిశా నిర్దేశం చేయనున్నారు. మునుగోడులో ప్రియాంక గాంధీ సభలో పాల్గొనాల్సిందిగా కోరాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

రేవంత్ - కోమటిరెడ్డికి క్లారిటీ
అభిప్రాయాలు తీసుకున్నా.. వెంటనే అభ్యర్ధిని ప్రకటించే ఛాన్స్ లేదు. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండనున్నారు. ఇంకా, టీఆర్ఎస్ తమ అభ్యర్ధిని ఖరారు చేయలేదు. దీంతో..ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాతనే అభ్యర్ధిని కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, తన సోదరుడు రాజీనామా చేసిన నియోజకవర్గంలో ప్రచారానికి సంబంధించి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న వెంకటరెడ్డిని నియోజకవర్గంలోనే ఉండాల్సిందిగా సూచించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో.. రేవంత్.. కోమటిరెడ్డి పాల్గొంటున్న ఈ సమావేశంలో ప్రధానంగా ఈ ఇద్దరి నేతలకు ఎటువంటి మార్గ నిర్దేశం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications