priyanka reddy murder : రోజా స్పందన .. అరబ్ దేశాల్లోలా అలా చెయ్యాలి , చెయ్యి వెయ్యాలంటేనే భయపడాలి
డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై,హత్య భావించబడిన సంఘటన ఇప్పుడు దేశాన్ని కదిలిస్తుంది. మన చట్టాలను, మన న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తోంది.ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య విషయంలో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి.నేరస్తులకు శిక్ష వేయడంలో తాత్సారం చేస్తే ఊరుకునేది లేదని అటు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
అందుబాటులో లేని మేజిస్ట్రేట్, తహశీల్దార్ వద్దకు ప్రియాంక హత్యకేసు నిందితులు, పీఎస్ వద్ద ఆందోళన...
ప్రియాంక రెడ్డి మృతిపై ఏపీఐఐసి చైర్మన్ రోజా స్పందన
డాక్టర్ ప్రియాంక రెడ్డి మృతిపై ఏపీలోని ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసి చైర్మన్ రోజా స్పందించారు. ఈ వార్తలతో తాను బాధపడ్డానని, నిర్భయ చట్టాన్ని ప్రవేశపెట్టిన తరువాత దుండగులు అత్యాచారాలు చేస్తున్నారని వీటికి అడ్డుకట్ట లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు . అరబ్ దేశాల తరహా శిక్షలు ఇక్కడ విధిస్తే కాస్త భయం అయినా కలుగుతుందని పేర్కొన్నారు.
చట్టాల అమలులో లోపాల వల్లే ఇన్ని దారుణాలు అన్న నగరి ఎమ్మెల్యే
ప్రియాంకా రెడ్డిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి మృతదేహాన్ని కూడా తగలబెట్టారని ఆమె అన్నారు. ఈ కుర్రాళ్ల మానసిక స్థిరత్వం ఎంత ఘోరంగా ఉందో అర్ధం అవుతుందని రోజా అన్నారు. మహిళలు తమ కుమారులు లేదా భర్తలను ఇలాంటి విషయాల్లో ప్రోత్సహించవద్దని చెప్పారు.చట్టాల అమలులో చాలా లోపాలున్నాయని ఆమె చెప్పారు. బాధితుల న్యాయం కోసం పోరాడాలని ఆమె మానవ హక్కుల కమిషన్ను కోరారు.
ఆడపిల్లను కన్నందుకు భయపడుతున్నానన్న రోజా
ప్రియాంకను హత్య చేసిన వారిని బహిరంగంగా ఉరి తీయాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ఇలాంటి కామాంధులకు అరబ్ దేశాల్లో , దుబాయ్లో వేసే లాంటి శిక్షలు వేయాలని ఇంకో ఆడపిల్ల మీద చేయి వేయాలంటే భయపడేట్టు చేయాలని రోజా పేర్కొన్నారు . తాజా పరిస్థితులు చూస్తే తనకు ఓ ఆడపిల్ల ఉందని ప్రస్తుత దారుణాలను చూస్తుంటే ఆడపిల్లని ఎందుకు కన్నానా..? అని భయపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
మానవహక్కుల సంఘాలకు ఈ దారుణాలు కనిపించవా అని రోజా అసహనం
నేరస్తులు మన కులమనో, మన మతమనో వారికి సాయం చేయకూడదని పేర్కొన్నారు రోజా. ఇక మానవ హక్కుల సంఘాలపై కూడా రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు . నేరస్తులకు ఏదైనా జరిగితే వారికి మద్దతుగా ముందుగా వచ్చే మానవహక్కుల సంఘాలకు ఇలా బలైపోతున్న ఆడపిల్లల చావులు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. అంతేకాదు పోలీసుల తీరుపై కూడా రోజా అసహనం వ్యక్తం చేశారు .
పోలీసులపై ఆగ్రహం .. నిందితులను బహిరంగంగా ఉరి తియ్యాలన్న రోజా
ఇక అమ్మాయి కనపడటం లేదని ప్రియాంక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే మీ అమ్మాయి ఎవరితోనో లేచిపోయిందని పోలీసులు అనడం బాధాకరమని ఆమె చెప్పుకొచ్చారు. ఆ పోలీసుల కూతుళ్ళకి ఇలా జరిగితే అదే మాట అంటారా అని రోజా ఘాటుగా విమర్శించారు .బహిరంగంగా ఉరి తియ్యాలన్నారు రోజా .. ఆంధ్రప్రదేశ్లో మహిళ భద్రత కోసం సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన రోజా తెలంగాణా ఇలాంటి దారుణం జరగటం షాక్ కు గురి చేసిందని తెలిపారు.