కొత్త జిల్లాలపై కొత్త ట్విస్ట్: కేసీఆర్ అనుకున్నదొకటి.. చెప్పిందొకటి!
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కేసీఆర్ ఆదేశాలతో భూపరిపాలనా ప్రధాన కమిషనర్ రేమాండ్ పీటర్ అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల విషయమై కలెక్టర్లు పలు సూచనలు చేశారు. కలెక్టర్ల సూచనలు.. 30 జిల్లాల వరకు ఉందని తెలుస్తోంది.
ప్రజల సౌలభ్యం, చేరువగా పరిపాలన అందించేందుకు వీలుగా 30 జిల్లాల వరకు ఏర్పాటు చేయవచ్చని జిల్లాల కలెక్టర్లు సూచించారని తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పుడున్న పదికి.. మరో 14, 15 తోడుగా.. మొత్తం 24 లేదా 25 జిల్లాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావించారు.
కానీ కలెక్టర్లు మాత్రం 30 జిల్లాలకు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితర అధికారులు, పది జిల్లాల కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు.
కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, మండలాల ఏర్పాటుపై చర్చించారు. కలెక్టర్లు తమ జిల్లాలోని ప్రస్తుత జిల్లాలు, డివిజన్లు, మండలాలు, కొత్త ప్రతిపాదనలపై నివేదికలను ఇచ్చారు. ప్రతిపాదనలపై మ్యాప్లు అందించారు. తమ జిల్లాల్లో విభజన అవసరాలు, ప్రజల డిమాండ్లు, వారికి సౌలభ్యాల ప్రాతిపదికన కొత్త జిల్లాల గురించి కలెక్టర్లు వివరించారని తెలుస్తోంది.
కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఒకే జిల్లా జగిత్యాలను మొదట్లో ప్రతిపాదించినా తాజాగా కలెక్టర్ సిరిసిల్లను కలిపి నివేదిక ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా వనపర్తి, నాగర్కర్నూలుతో పాటు గద్వాల, నారాయణపేటల్లో ఒకటి జిల్లాకు అనుకూలమని సూచించారు.
రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రెండేసి కొత్త జిల్లాలకు తోడు శివారు ప్రాంతాల్లో మరో జిల్లా గురించి చర్చించారు. నల్గొండ, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండేసి కొత్త జిల్లాలు అనుకూలమని పేర్కొన్నారని తెలుస్తోంది.
నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో అదనంగా ఒక్కొక్క జిల్లాను సూచించారని తెలుస్తోంది. మొత్తంగా 30 జిల్లాలపై చర్చ జరిగింది. సీఎం నిర్దేశించిన ప్రకారం 24 నుంచి 25కి వరకు ఉంటాయని, ఈ మేరకు ప్రతిపాదనలను కుదించి బుధవారం సీఎంకు అందజేయాలని నిర్ణయించారు. కాగా, కొత్త జిల్లాల అంశాన్ని కేసీఆర్ నేడు పరిశీలించనున్నారు.