కేటీఆర్కు కౌంటర్: కరోనా టెస్టింగ్స్ చేస్తేనే కదా విషయం తేలేది: ఏపీ బెటర్..: కే నాగేశ్వర్
హైదరాబాద్: కరోనా వైద్య పరీక్షల సంఖ్యను పెంచడంపై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కరోనా టెస్టింగులను ఎక్కువగా నిర్వహించడం వల్ల ప్రైజులేమైనా ఇస్తారా? అంటూ ఆయన చేసిన కామెంట్ల పట్ల మేధావులు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. తక్కువ పరీక్షలను నిర్వహించినప్పుడే వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు తెలంగాణలో వెలుగులోకి వచ్చాయని, ఇక ఏపీ తరహాలో అధిక సంఖ్యలో టెస్టింగ్స్ నిర్వహించితే.. వచ్చే ఫలితాలు తీవ్రంగా ఉంటాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
తెలంగాణలో కరోనా వైరస్ పరీక్షలను పెంచాల్సిన అవసరం ఉందని ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా కూడా ప్రస్తావించిందని గుర్తు చేశారు. తక్కువ సంఖ్యలో పరీక్షలను నిర్వహిస్తున్నారనే విషయంపై జాతీయ మీడియా ప్రత్యేక కథనాలను రాస్తోందని పేర్కొన్నారు. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో అతి తక్కువ సంఖ్యలో కరోనా వైరస్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. పరిమితంగా టెస్టింగులను నిర్వహించిన సమయంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయనే విషయాన్ని విస్మరించకూడదని అన్నారు.
కరోనా వైరస్ పరీక్షల విషయంలో ఏపీ నంబర్వన్గా ఉందనే విషయాన్ని జాతీయ మీడియా గుర్తించిందని నాగేశ్వర్ అన్నారు. తెలంగాణలో తక్కువ సంఖ్యలో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి ప్రత్యేకించి కారణం ఉందని తాను భావించట్లేదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం కాస్త దూకుడుగా వైరస్ టెస్టింగులను చేపట్టాలని నిర్ణయించుకుని ఉండొచ్చని, దానికి అనుగుణంగా పని చేస్తోందని అన్నారు. వేల సంఖ్యలో టెస్టింగులను నిర్వహించడం వల్ల భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. ఏపీ తరహాలో తెలంగాణ ప్రభుత్వం అగ్రెసివ్గా టెస్టింగులను నిర్వహించట్లేదని అన్నారు.
Recommended Video
పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణ ఎందుకు చేయట్లేదని ఆయన ప్రశ్నించారు. పరీక్షలను నిర్వహించినప్పుడే పాజిటివ్ కేసులు అనేవి ఉన్నాయా? లేవా? అనేది బయటపడుతుందని కే నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఈ విషయాన్ని జాతీయ మీడియా సైతం ప్రత్యేక కథనాల్లో ప్రస్తావించిందని అన్నారు. టెస్టింగులను తక్కువగా చేపట్టి, తమ రాష్ట్రంలో కేసులు పరిమితంగా ఉన్నాయని అనుకోవడం సరికాదని చెప్పారు.