బందూక్ పహారాలో సచివాలయం.. మరో 2 నెలలు నిషేధాజ్ఞలు
హైదరాబాద్ : సచివాలయం దగ్గర సెక్యూరిటీ మరింత టైట్ చేశారు పోలీస్ అధికారులు. ఎన్నికల వేళ సెక్రటేరియట్ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే నిషేధాజ్ఞలు విధించారు. తాజాగా మరో 2 నెలల పాటు నిషేధాజ్ఞలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు సీపీ అంజనీకుమార్. ఈనెల 23వ తేదీ నుంచి జనవరి 22 వరకు ప్రొహిబిటరీ ఆర్డర్స్ అమల్లో ఉంటాయి. సచివాలయం చుట్టూ పోలీస్ పహారా ఉండటమే గాకుండా.. సీసీ కెమెరాలు, నిఘా వర్గాలతో భద్రతా కట్టుదిట్టం చేశారు.
తెలంగాణ, ఏపీ సచివాలయాలు రెండింటికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఒకే దగ్గర ఇరు రాష్ట్రాల సచివాలయాలు కొనసాగుతుండటంతో ఈ ఆంక్షలు రెండింటికి అమలవుతాయి. నిషేధాజ్ఞలు మరో 2 నెలలు పొడిగించడంతో సెక్రటేరియట్ దగ్గరే కాకుండా చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో సభలు, సమావేశాలు నిర్వహించరాదు. ఐదుగురు వ్యక్తులకన్నా ఎక్కువమంది సంచరించడం, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడం, ఆయుధాలతో సంచరించడం, ధర్నాలు, ర్యాలీల వంటివి నిషేధమని తెలిపారు సీపీ. ఎవరైనా సరే ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.