రేవంత్ రెడ్డి టార్గెట్ అతనే: ఎవరీ పుట్ట సుధాకర్ యాదవ్?
రేవంత్ రెడ్డి తన ఆరోపణల్లో ఆయన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడి పేరును ప్రస్తావించి, తెలంగాణ నుంచి 2 వేల కోట్ల కాంట్రాక్టును పొందారని అన్నారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తిరుగుబాటు జెండా ఎగురేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నుంటి కాంట్రాక్టులు పొందుతున్నారని, అందుకే కెసిఆర్కు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు.
Recommended Video
తన ఆరోపణల్లో ఆయన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడి పేరును ప్రస్తావించి, తెలంగాణ నుంచి 2 వేల కోట్ల కాంట్రాక్టును పొందారని అన్నారు. ఈ ఆరోపణతో అందరి దృష్టి పుట్టా సుధాకర్ యాదవ్ వైపు మళ్లింది.
రేవంత్ రెడ్డి పుట్టా సుధాకర్ యాదవ్ను కూడా టార్గెట్ చేశారు. కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ ాదవ్ ప్రముఖ పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన కడప జిల్లాకు చెందినవారు.
ఇలా వార్తల్లోకి....
రేవంత్ రెడ్డి ఆరోపణలకు ముందు పుట్టా సుధాకర్ యాదవ్ మరో కారణంతో వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్గా నియమించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు, అందుకు పలువురి నుంచి వ్యతిరేకత ఎదురైనట్లు వార్తలు వచ్చాయి. అది వివాదంగా కూడా మారింది. పుట్టా సుధాకర్ యాదవ్ క్రైస్తవ అభిమాని అని, ఆయనకు టిటిడి వంటి హిందూ ధార్మిక సంస్థ బాధ్యతలు అప్పగించడం సరి కాదని కొంత మంది వాదించారు.
వారిద్దరికీ వియ్యంకుడు..
తెలుగుదేశం పార్టీ నాయకుడైన పుట్టా సుధాకర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడికి వియ్యంకుడు. ఆయన కడప జిల్లాలోని ధనికుల్లో, పారిశ్రామికవేత్తల్లో ఒకరు. ఆయనకు లభించిన కాంట్రాక్టు విషయంలోనే రేవంత్ రెడ్డి యనమలపై ఆరోపణల బాణం సంధించాడు. అంతే కాదు, పుట్టా సుధాకర్ యాదవ్ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్కు కూడా వియ్యంకుడు. పిఎస్కె ఇన్ఫ్రా పేరు మీద పుట్టా సుధాకర్ యాదవ్ కాంట్రాక్టులు పొందుతుంటారు. మిషన్ భగీరథ, ఇతర ప్రాజెక్టుల కాంట్రాక్టు పనులు ఆయనకు ఇప్పించడానికి యనమల రామకృష్ణుడు కెసిఆర్తో స్వయంగా మాట్లాడారని రేవంత్ రెడ్డి ఆరోపణ.
చాలా చిన్న కుటుంబం నుంచే....
పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని జడ్ కొత్తపల్లి గ్రామానికి చెందినవారు. ఆ ఊళ్లో పట్టుమని 300 ఓట్లు ఉండవు. ఊళ్లో ఉండేది రెండే కులాలు, రెడ్లు, గొల్లలు. సుధాకర్ యాదవ్ చాలా చిన్న కుటుంబం నుంచే వచ్చారు. మొదట వెంకట్రామయ్య యాదవ్ అనే కాంట్రాక్టరు వద్ద పనిచేసేవారని, ఆయన సహకారంతో చిన్నగా రోడ్ల కాంట్రాక్టులు చేస్తూ తర్వాత పిఎస్కె ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీని స్థాపించారని చెబుకుంటారు. దాని టర్నోవర్ ప్రస్తుతం 5 వేల కోట్ల నుంచి 10 వేల కోట్ల వరకు ఉంటుదని చెబుతారు. దానికి ఆయన చైర్మన్.
ఖండించిన పుట్టా సుధాకర్ యాదవ్
పుట్టా సుధాకర్ యాదవ్ 2014 ఎన్నికల్లో మైదుకూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను పుట్టా సుధాకర్ యాదవ్ ఖండిస్తున్నారు. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణలో తమ సంస్థ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మాత్రం చేస్తోందని, దాని కాంట్రాక్టు విలు రూ 290 కోట్లని ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. యనమల రామకృష్ణుడి సహాయంతో తాను రూ.1,500 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు పొందినట్లు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. యనమల ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరని, తాము తమిళనాడులో కూడా ప్రాజెక్టులు చేస్తున్నామని ఆయన చెప్పారు. తమ సంస్థ చాలా కాలంగా చేస్తున్న ప్రాజెక్టుల గురించి ఆయన చెప్పారు.