మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి: ఆధునిక భారత నిర్మాత అంటూ కేసీఆర్ ఘన నివాళి
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఘన నివాళుర్పించారు. ఈ సందర్బంగా పీవీ సేవలను కొనియాడారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత అని వీపీని ప్రశంసించారు.
ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన పీవీకి దేశ ప్రజలంతా రుణపడి ఉంటారన్నారు.

దేశ ప్రధానిగా వినూతన విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచిన పీవీ నర్సింహారావు స్ఫూర్తి.. తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో ఇమిడి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా ఉందని అన్నారు.
తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పీవీ నిరూపించారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు సీఎం కేసీఆర్.ఈ మేరకు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో జూన్ 28, 1921లో పీవీ నర్సింహారావు జన్మించారు. ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఆయన ఎనలేని సేవలందించారు.












Click it and Unblock the Notifications