మహంకాళి అమ్మవారికి పీవీ సింధు బంగారు బోనం: ఏం కోరుకున్నారంటే.?
Recommended Video
హైదరాబాద్: నెల రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన చారిత్రక గోల్కొండ కోట బోనాల ఉత్సవాలు ఆదివారం కుంభహారతితో ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆఖరు రోజు కోటకు వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు, తొట్టెలను సమర్పించారు.
ఈ సందర్భంగా పురావస్తుశాఖ కోటలోకి ఉచితప్రవేశాన్ని కల్పించింది. ఆదివారం సాయంత్రం అమ్మవారికి కుంభహారతి, బలిగంప కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి కల్లుసాక నిర్వహించారు. కోటకు వచ్చిన విదేశీ పర్యాటకులు పూజలను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో ఈవో మహేందర్కుమార్, సాయిబాబాచారి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
బంగారు బోనంతో సింధు
ఇది ఇలా ఉండగా, లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి ఆదివారం భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు బంగారు బోనంతో అమ్మవారికి మారుబోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయానికి విచ్చేసిన పీవీ సింధుకు ఆలయ కమిటీ చైర్మన్ పీ వై కైలాష్ వీర్,ఉపాధ్యక్షులు కె.వెంకటేష్, బి. అరవింద్ కుమార్, కోశాధికారి జి. అరవింద్ గౌడ్లు బాజా బీజంత్రి లతో ఘన స్వాగతం పలికారు.
ప్రతీ సంవత్సరం వస్తున్నా..
పీవీ సింధు తల మీద బంగారు బోనంను పెట్టుకొని ఆలయంలో అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. .ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నానని అన్నారు.
అందుకే ఇప్పుడు మారుబోనం
చైనా లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పోటీల్లో పాల్గొన్న కారణంగా గత వారం జరిగిన లాల్ దర్వాజా బోనాల పండుగ లో పాల్గొన లేదని అన్నారు. ఈ రోజు అమ్మవారికి మారుబోనం సమర్పించనని తెలిపారు. ఆమె ఇటీవల జరిగిన ఛాంపియన్ షిప్ పోటీలో రజతం సాధించిన విషయం తెలిసిందే.
ఏషియన్ గేమ్స్లో విజయం సాధించేలా..
ఏషియన్ గేమ్స్లో విజయం సాధించేలా దీవించాలని వేడుకున్నట్లు పీవీ సింధు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు జి. మహేష్ గౌడ్, బి బల్వాన్త్ యాదవ్, కాశీనాథ్ గౌడ్, మానిక్ ప్రభు గౌడ్,భాస్కర్,హేమానంద్,సుధాకర్, కె.విష్ణు గౌడ్,తదితరులు పాల్గొన్నారు.