కరోనా వైరస్ ఎఫెక్ట్: క్వార్టర్ రూ.300, మందుబాబులను నిలువునా దోస్తున్న బెల్ట్ షాపులు,అధికారుల అండతో..
వైరస్తో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంది. ఆస్పత్రి, మెడికల్ షాపు తప్ప అన్నీ బంద్. నిత్యావసరాల కోసం కిరాణా షాపులు పరిమితంగా తెరుస్తున్నారు. గత పదిహేను రోజులుగా వైన్స్ మూసివేసి ఉన్నాయి. దీంతో మందుబాబులకు ఏం తోచడం లేదు. మందుబాబుల వీక్నెస్ పట్టిన కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. మారుమూల పల్లెల్లో బెల్ట్ షాపులు యథేచ్చగా తెరచి ఉంటున్నాయి. అయితే వైన్స్ క్లోజ్ ఉన్నందున.. రూ.120కి వచ్చే క్వార్టర్ మందును రూ.300 నుంచి రూ400 వరకు విక్రయిస్తున్నారు. అసలే వైన్స్ మూసివేసి ఉండటంతో.. బెల్ట్ షాపు ఓనర్లు ఎంత అంటే అంత ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు.
బెల్ట్ షాపుల ద్వారా..
వాస్తవానికి వైన్స్ మూసివేసి 15 రోజులవుతోంది. ఇన్నిరోజులు బెల్ట్ షాపుల వద్ద స్టాక్ ఉండదు. కొందరు వైన్ షాపు యాజమానులు మరోచోట లిక్కర్ పెట్టి.. బెల్ట్ షాపు యాజమానుల ద్వారా లిక్కర్ విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల ఎక్కువ మందు నిల్వ చేసి.. తమ వద్దకొచ్చేవారికి అధిక ధరకు విక్రయిస్తున్నారు. మద్యానికి అలవాటుపడిన ప్రాణం కావడంతో.. వారు ఎంత చెబితే అంతకే కొనుగోలు చేస్తున్నారు. అలా వికారాబాద్ జిల్లా మారుమూల పల్లెల్లో మందును అధిక ధరకు విక్రయించి నిర్వాహకులు సొమ్ముచేసుకుంటున్నారు.
పట్టించుకోరే..
పల్లెల్లో బెల్ట్ షాపులు యథేచ్చగా నడుస్తోన్న ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్స్ షాపు ఓనర్స్, బెల్ట్ షాపు నిర్వాహకులతో ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ప్రజాసంఘాలు, మేధావులు కోరుతున్నారు.
Recommended Video
ఫేక్ నోట్..
ఇదిలా ఉంటే ఇటీవల ఆదివారం నుంచి మద్యాహ్నం వైన్స్ తెరుస్తామని ఎక్సైజ్ శాఖ పేరుతో నోట్ సోషల్ మీడియాలో తెగ వైరలైంది. వాస్తవానికి అది ఆబ్కారీ శాఖ జారీచేయలేదు. కొందరు ఆకతాయిలు తేదీ మార్చి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది వైరలవడంతో... ఉన్నతాధికారుల దృష్టికి కూడా వచ్చింది. ఫేక్ నోట్ స్ప్రెడ్ చేసిన వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.