తక్కువ గిరిజనం...అక్కడే విశ్వవిద్యాలయమా?
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి పరిణామమే సంభవించింది. ఈ జిల్లాలో నెలకొల్పాల్సిన గిరిజన విశ్వవిద్యాలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు తరలిపోయింది.
ఖమ్మం: ప్రజాస్వామ్య పాలనలో అన్ని నిర్ణయాలు ప్రభుత్వాలు సొంతంగా తీసుకోలేవు. ఇందుకు కారణం బలమైన లాబీయింగే. ముఖ్యంగా మంత్రులు, అధికార పార్టీకి చెందిన నాయకులు, ఇతర ప్రముఖులు సాగించే లాబీయింగ్ కారణంగా నిర్ణయాలు మారిపోతుంటాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఎక్కువగా ప్రభావితం చేయగలిగితే వారి ప్రయోజనాలు నెరవేరతాయి. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి పరిణామమే సంభవించింది. ఈ జిల్లాలో నెలకొల్పాల్సిన గిరిజన విశ్వవిద్యాలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు తరలిపోయింది. ఆ జిల్లాలోని ములుగు మండలంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు.
ఇక్కడ విచిత్రమేమిటంటే విస్తారంగా అటవీ ప్రాంతం, ఎక్కువ గిరిజనం ఉన్న భద్రాచలం ప్రాంతంలో కాకుండా తక్కువ గిరిజన జనాభా ఉన్న జయశంకర్ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించడం. ఇదేం న్యాయమని గిరిజన ప్రముఖులు, నాయకులు ప్రశ్నిస్తున్నారు. విశ్వవిద్యాలయం కోసం అక్కడ ఐదొందల ఎకరాలు సేకరించారు. ఇతర జిల్లాల్లో అడవులు ఉన్నప్పటికీ ఎక్కువ అటవీ ప్రాంతం భద్రాద్రి జిల్లాలోనే ఉంది. దండకారణ్యం అనగానే భద్రాచలం ప్రాంతం గుర్తుకొస్తుంది.
అంతేకాకుండా ఇది దక్షిణ అయోధ్యగా వ్యవహరించే రామాలయం ఉన్న జిల్లా. ఇక్కడి సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) చాలా పెద్దది. ఏ లెక్కన చూసిన విశ్వవిద్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయాల్సివుందని గిరిజన నాయకులు చెబుతున్నారు. కేంద్రంలో యూపీఏ సర్కారు ఉన్నప్పుడు విశ్వవిద్యాలయం కోసం చర్ల ప్రాంతంలో 300 ఎకరాలు గుర్తించారు. దీంతో యూనివర్శిటీ వస్తుందని సంతోషించారు. చివరకు అది ఆవిరైపోయింది.
రాష్ట్రంలో ఉన్న దాదాపు 32 లక్షల గిరిజన జనాభాలో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో నాలుగు లక్షలమంది ఉన్నారు. అదే జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో సుమారు లక్షన్నరమంది ఉన్నారు. జనాభాలో ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయం అక్కడికే తరలిపోయింది. గిరిజనులు ఉన్న ఏ జిల్లాతో పోల్చిచూసినా భద్రాద్రి జిల్లాలో గిరిజనం ఎక్కువ. అటవీ ప్రాంతమూ అధికమే. గత ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ తరపున గెలిచి ఆ తరువాత అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఏమీ మాట్లాడటంలేదనే విమర్శలున్నాయి.