తెరాసలో చేరట్లేదని కుట్ర, నయీం అలా నా శిష్యుడు కావొచ్చు: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరలేదనే ఉద్దేశ్యంతోనే తన పైన కుట్ర చేస్తున్నారని, నయీంతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య బుధవారం నాడు అన్నారు. తాను చేసిన ఉద్యమాల కారణంగా నయీం తనకు శిష్యుడు అయి ఉండవచ్చునని చెప్పాడు.
బీసీ ఉద్యమాన్ని అణిచివేసేందుకే గ్యాంగ్ స్టర్ నయీంతో తనకు సంబంధాలున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నయీం కేసును సీబీఐతో లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
కుట్రతోనే నయీంకు తనకు సంబంధాలు ఉన్నాయని కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తన ఎదుగుదలను ఓర్వలేకే తనపై అసత్య ప్రచారం చేయిస్తున్నారన్నారు. తనపై ఆరోపణలు చేసేవారు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నయీంతో ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు చూపిస్తే దానిపై సమాధానం చెబుతానన్నారు.