కేసీఆర్, తోట చంద్రశేఖర్పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
హైదరాబాద్: తెలంగాణ ఆస్తులను సీఎం కేసీఆర్ ఆంధ్రవాళ్లకు కట్టబెట్టుడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఆ డబ్బులనే తోట చంద్రశేఖర్ తో బీఆర్ఎస్ సభకు ఖర్చు పెట్టిస్తున్నారని అన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు.
రూ. 4 వేల కోట్ల తెలంగాణ ఆస్తులు ఆంధ్ర కాంట్రాక్టర్కు?
సీఎం కేసీఆర్ రూ. 4వేల కోట్ల తెలంగాణ ఆస్తులను ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ కు కట్టబెడుతున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. తోట చంద్రశేఖర్ తో బీఆర్ఎస్ సభకు ఖర్చు పెట్టిస్తున్న వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరుగుతోందని ఆయన ఆరోపించారు. మియాపూర్ భూములను బీఆర్ఎస్ ఆంధ్ర అధ్యక్షుడికి ఎలా కట్టబెట్టడుతున్నారని నిలదీశారు. ఈ విషయం రేపు ఖమ్మంలో జరిగే సభలో చెబితే బాగుంటుందన్నారు.
ఆదిత్య కంపెనీ పేరు మీద 40 ఎకరాలు కొన్న తోట చంద్రశేఖర్!
హఫీజ్పేటలోని 78 సర్వే నెంబర్ భూములను తనఖా పెట్టి ఎంబీఎస్ జువెల్లర్స్ సుఖేష్ గుప్తా రుణం తీసుకున్నారని.. ఆ భూమిని అమ్ముకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చిందని రఘునందన్ తెలిపారు. అయితే, దీనికి వ్యతిరేకంగా ఈ 7 ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారని చెప్పారు. ఇక్కడ కనిపించని మరో కోణం ఉందన్నారు రఘునందన్. ఇదే సర్వే నెంబర్లో 40 ఎకరాల భూమి ఆదిత్య కంపెనీ మీద తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారని తెలిపారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో జిల్లా కలెక్టర్ అప్పీలుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. బీఆర్ఎస్ అంటే బీహార్ రాష్ట్ర సమితి అంటూ ఎద్దేవా చేశారు.
నిజాం వారసులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలా?
ఇక నిజాం అంత్యక్రియలపైనా ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ దెబ్బకొడుతున్నారన్నారు. సమైక్య వాదానికి మద్దతు తెలిపిన నిజాం వారసులకు కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ఎవరికి ఊడిగం చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. కేసీఆర్ చర్యలతో కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ లాంటి వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని ధ్వజమెత్తారు రఘునందన్ రావు.