ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ కు మరో షాక్.. ఎంఐఎం పార్టీ సభ్యత్వం రద్దు
హైదరాబాద్ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివాదాస్పద వీడియోల వ్యవహారంలో ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ ను ఇప్పటికే ఎంఐఎం పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఆ పార్టీ అధిష్ఠానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్ ఏ హుస్సేన్ అన్వర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వెంటనే శాసన మండలి ఛైర్మన్ కు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల అత్తాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మీర్జా రహమత్ బేగ్ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎంఐఎం పార్టీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇదే అంశంపై ఏఐఎంఐఎం జాయింట్ సెక్రటరీ హుస్సేన్ అన్వర్ ఎక్స్ లో ఈ విధంగా పోస్టు చేశారు. మీర్జా రహమత్ బేగ్ ను ఏఐఎంఐఎం నుంచి తక్షణమే బహిష్కరించడం జరిగింది.. ఆయన వెంటనే శాసన మండలి ఛైర్మన్ కు తన రాజీనామాను సమర్పించాల్సి ఉంటుంది.. అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ నుంచి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ ను ఎందుకు బహిష్కరించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అర్ధరాత్రి సస్పెండ్ చేయడం వెనుక మర్మమేంటని ప్రశ్నలు సంధించారు.

మరోవైపు ఈ అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తాజాగా స్పందించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటనలో బేగ్ ప్రమేయం ఉందని కీలక ఆరోపణలు చేశారు. ఈ విషయంపై రాజకీయ పార్టీలు మౌనం వహించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగ్ ఎమ్మెల్సీ గెలుపులో కాంగ్రెస్, బీఆర్ఎస్ సాయపడ్డాయని ఆయన కీలక ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఈ అంశంపై ఆయా పార్టీలు ఇప్పుడు బహిరంగంగా స్పందించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications