కాంగ్రెస్ కు రాహుల్ టెన్షన్ -మునుగోడు పై ఎఫెక్ట్..!!
తెలంగాణ కాంగ్రెస్ కు ఇది పరీక్షా సమయం. వ్యక్తిగతంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ సమర్ధతకు సవాల్. మునుగోడులో టీఆర్ఎస్ -బీజేపీ అన్నట్లుగా సాగుతున్న పోరులో కాంగ్రెస్ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. సొంత పార్టీకి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ ను ఓడించటమే ఇప్పుుడు రేవంత్ ముందున్న అసలైన టాస్క్. రానున్న అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ బైపోల్ లో పార్టీ బలం చాటాలనేది రేవంత్ ప్లాన్. కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పార్టీ ముఖ్య నేత రాహుల్ ఈ నెల 23న తెలంగాణలో తన యాత్ర ప్రారంభిస్తున్నారు.
దీనికి సంబంధించి రూట్ మ్యాప్ అధికారికంగా ఫైనల్ అయింది. కాంగ్రెస్ కీలక నేత వేణు గోపాల్ తెలంగాణలో భారత్ జోడో యాత్ర సక్సెస్ బాధ్యత రేవంత్ కు అప్పగించారు. ప్రచారంలో ముందుకే రేవంత్ జోడో యాత్ర లో ఎందుకు వెనుకబడ్డారని ప్రశ్నించారు. రాహుల్ యాత్ర అక్టోబర్ 23వ తేదీన ప్రారంభమై రాష్ట్రంలో 375 కిలో మీటర్లు సాగనుంది. హైదరాబాద్ నగరంలోనూ యాత్ర ప్లాన్ చేసారు. అక్టోబర్ 31న జోడో యాత్ర హైదరాబాద్ లోకి ప్రవేశిస్తుంది. హైదరాబాద్ లో చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకుంటుంది. ఇందిరాగాంధీ వర్దంతి సందర్బంగా నెక్లెస్ రోడ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసారు.

సరిగ్గా ఆ తరువాత నాలుగు రోజులకే మునుగోడు బై పోల్ ఉంది. ప్రచారం పీక్ కు చేరే సమయంలో రాహుల్ రాష్ట్రంలోకి వస్తుండటంతో..పార్టీ నేతలంతా రాహుల్ వద్ద హాజరు వేయించుకోవటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే మునుగోడు లో కాంగ్రెస్ ప్రచారంలో కీలక నేతల పాత్ర తగ్గింది. ఇప్పుడు తెలంగాణలో భారత్ జోడో యాత్ర విషయంలో ఇతర రాష్ట్రాలతో పోటీ నెలకొంది. కర్ణాటకలో రాహుల్ యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణలోనూ మరో ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. రేవంత్ టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ అధినాయకత్వం నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక యాత్ర కావటంతో ఇప్పుడు ఇది రేవంత్ కు వ్యక్తిగతంగానూ కీలకం కానుంది.
బీజేపీకి కావాల్సింది ఇదే. కాంగ్రెస్ - కోమటిరెడ్డి బంధం అక్కడ రాజగోపాల్ రెడ్డి మీద ప్రభావం ఉంటుందనే అనుమానం బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ కీలక నేతలు మునుగోడుకు దూరంగా ఉండటం ద్వారా తమకు మరింత సమయం కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. దీంతో..అటు రాహుల్ పాదయాత్ర - ఇటు మునుగోడు బై పోల్ రెండు రేవంత్ సమర్ధతకు పరీక్షగా మారుతున్నాయి. దీంతో..మునుగోడు బై పోల్ లో కాంగ్రెస్ కు రాహుల్ ఎఫెక్ట్ ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications