తెలంగాణలో మూడు రోజులపాటు రాహుల్, ప్రియాంక పర్యటన: ఎప్పట్నుంచంటే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వస్తున్నారు. మూడు రోజులపాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించారు. ఈ విషయాలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. ములుగు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ఉంటుందని, పెద్దపల్లిలో భారీ బహిరంగ సభ జరగనుందని చెప్పారు.

ఈ సభలో రాహుల్, ప్రియాంక పాల్గొననున్నారని ఆయన తెలిపారు. అక్టోబర్ 18న జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయాన్ని కూడా రాహుల్, ప్రియాంకలు సందర్శించి పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం.
మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వామపక్షాలతో పొత్తుపై, మిగిలిన స్థానాలపై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు తొలి జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. మరికొంత మంది కాంగ్రెస్ నేతలకు కూడా చోటు దక్కకపోవడంతో వారంతా పార్టీని వీడుతున్నారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డికి కూడా సీటు దక్కకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేత జానా రెడ్డి, ఆయన బృందం నాగంను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications