వెరీ ఇంట్రెస్టింగ్: తెలంగాణలో రాహుల్-చంద్రబాబు కలిసి ప్రచారం, రెండు సభల్లో ప్లాన్
హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఒక్కచోట చూశాం. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కూటమి ఏర్పడిన తర్వాత ఢిల్లీకి వెళ్లి కలిశారు. వారిద్దరు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
అంతా తారుమారు, తగ్గిన టీడీపీ.. 14వ సీటు వదిలేసిన తమ్ముళ్లు: లాస్ట్ మినిట్లో ఊహించని ట్విస్ట్లెన్నో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నో చిత్రవిచిత్రాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మరో సంఘటన చోటు చేసుకోనుంది. చంద్రబాబు, రాహుల్ గాంధీలు కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు. దాదాపు 36 ఏళ్లపాటు కారాలుమిరియాలు నూరుకున్న పార్టీల అధినేతలు ఒకే వేదికపై ప్రచారం చేయనుండటం గమనార్హం.
చంద్రబాబు, రాహుల్ గాంధీలు కలిసి ప్రచారం
తెలంగాణలో సోమవారం నామినేషన్ల పర్వం ముగిసింది. ఎన్నికలకు మరో పదిహేడు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 29, 30 తేదీలలో కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
అందుకే ఇద్దరూ ఒక్కటయ్యారు
2019 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీయేతర కూటమి ఏర్పాటులో భాగంగా చంద్రబాబు, రాహుల్ గాంధీ ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో వారిద్దరు కలిసి తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. చంద్రబాబు పార్టీ అభ్యర్థులతో పాటు మహాకూటమి గెలుపు కోసం ప్రచారం చేస్తారు.
రెండు సభల్లో చంద్రబాబు, రాహుల్ కలిసి ప్రచారం
ఇప్పటికే మహాకూటమిలోని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రచారంతో మరింత ఊపు వస్తుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. దానికి రాహుల్ గాంధీ తోడవడం మరింత ప్లస్ అవుతుందని అంటున్నారు. రాహుల్ పాల్గొనే ప్రచార సభల్లో చంద్రబాబు కూడా హాజరు కానుండటం గమనార్హం. ఇద్దరు కలిసి రెండు సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ సభల తర్వాత లేదా అంతకుముందే పార్టీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారం చేస్తారు.
సోనియాతో కలిసి ప్రచారం చేసే అవకాశం లేదు
చంద్రబాబు వీలైనన్ని ఎక్కువ చోట్ల రోడ్డు షోలు నిర్వహించేలా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు షెడ్యూల్ రూపొందించారు. రాహుల్ గాంధీతో కలిసి రెండు సభల్లో పాల్గొననున్న చంద్రబాబు.. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో కలిసి ప్రచారంలో పాల్గొనే అవకాశాలు లేవు. సోనియా గాంధీ ఈ నెల 23వ తేదీన బహిరంగ సభలోపాల్గొంటారు.