తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ షెడ్యూల్ ఖరారు: ఆ ఒక్కరోజే ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం
హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ (Telangana) కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ నవంబర్ 17వ తేదీన తెలంగాణ రానున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఒక్క రోజులోనే ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలల్లో పర్యటించి ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 17వ తేదీన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు పినపాకకు చేరుకుంటారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో, కార్నర్ సమావేశం నిర్వహిస్తారు.

పినపాక నుంచి హెలికాప్టర్లో.. నర్సంపేటకు చేరుకుని 3 గంటల వరకు ప్రచారం చేస్తారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ ఈస్ట్ చేరుకుంటారు. వరంగల్ ఈస్ట్ లో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర చేస్తారు. వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్లో కూడా ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గంలో రాజేంద్రనగర్ చేరుకుని అక్కడ ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళతారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఏఐసీసీ నివేదించింది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు రాష్ట్ర నాయకులకు కూడా భాగస్వామ్యం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ప్రచారంలో పాల్గొంటారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిలకు అవకాశం కల్పించారు.
ఆ తర్వాత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సల్మాన్ కుర్షీద్, జీవన్ రెడ్డి, జయరాం రమేశ్, దీపాదాస్ మున్సీ, రేణుక చౌదరి, మురళీధరన్, సయ్యద్ నసీర్ హుస్సేన్, దామోదర రాజనర్సింహ, చల్లా వంశీచంద్ రెడ్డి, హనుమంతురావు, బలరాంనాయక్, జానారెడ్డి తదితరులు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. మధుయాస్కీ గౌడ్, దుద్దిర్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహ్మద్ అజారుద్దీన్, సీతక్క, బెల్లయ్యనాయక్, పీసీ విష్ణునాధ్, మన్సూర్ అలీఖాన్, రోహిత్ చౌదరి, మహేశ్కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications