చంద్రబాబు వల్లే, 2004లోనే మెచ్చుకున్నా, 2019లో బీజేపీని ఓడిస్తాం: రాహుల్ గాంధీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో కలిశారని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం చెప్పారు. హైదరాబాదులోని సనత్ నగర్ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. హైదరాబాదును నిర్మించేందుకు చంద్రబాబు ఎంతో కష్టపడ్డారన్నారు.
హైదరాబాద్ నగరానికి విశిష్టమైన చరిత్ర ఉందని చెప్పారు. ఇది అందరి నగరం అన్నారు. ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి, ప్రేమతో ఉంటారని చెప్పారు. కలిసిమెలిసి ఉంటే ప్రజల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ విభేదాలు సృష్టిస్తారని ఆరోపించారు.
ఆ టైంలో కొదమసింహంలా రేవంత్ రెడ్డి వచ్చారు, ఆ తర్వాతే కేసీఆర్ను వ్యతిరేకించా: కోదండరాం
2004లోనే చంద్రబాబును ప్రశంసించా
2004 ఎన్నికల సమయంలో తాను చంద్రబాబు నాయుడు బాగా పని చేశారని చెప్పానని రాహుల్ గాంధీ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉందన్నారు. రాష్ట్ర నిధులు అన్నీ ఒక కుటుంబం చేతిలోకి వెళ్లాయని చెప్పారు. దేశంలోని వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్, టీడీపీ కలిసి హైదరాబాద్ను అభివృద్ధి చేశాయి
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి హైదరాబాదును అభివృద్ధి చేశాయని రాహుల్ గాంధీ చెప్పారు. 21వ శతాబ్ధంలో చైనా, ఇండియా పోటీ పడతాయని అమెరికా అధ్యక్షులు చెప్పారన్నారు. న్యాయమూర్తి హత్య కేసులో బీజేపీ అధ్యక్షుడి పేరు వచ్చిందని అన్నారు. మోడీ పాలనపై సుప్రీం కోర్టు జడ్జిలు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారన్నారు. బీజేపీ వల్లే న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చారని చెప్పారు.
రాఫెల్ స్కాంపై రాహుల్
హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో యుద్ధ విమానాలు తయారవుతాయని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ రాపెల్ యుద్ధ విమానాలు ప్రభుత్వ సంస్థకు ఇవ్వకుండా ప్రయివేటు సంస్థకు ఇచ్చారని ఆరోపించారు. రాఫెల్ యుద్ధ విమానాల గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడే చెప్పారన్నారు. ప్రజలకు అచ్చేదిన్ వస్తాయని అనుకుంటే ప్రయివేటు కంపెనీలకు వచ్చాయన్నారు. రాఫెల్ కుంభకోణం దేశంలోనే అతిపెద్దది అన్నారు. బీజేపీయేతర కూటమిలో తెరాస ఎందుకు కలవడం లేదన్నారు. మజ్లిస్, తెరాసల వెనుక బీజేపీ ఉందన్నారు. తెరాస మోడీ బీ టీమ్ అన్నారు.
ప్రజాకూటమి అధికారంలోకి వస్తుంది
ప్రజాకూటమి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక అని రాహుల్ గాంధీ చెప్పారు. ఎన్నికలు వస్తుంటాయి... పోతుంటాయని, కానీ ప్రభుత్వం పని చేయాలని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం కూడా ఉండాలన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోను కాంగ్రెస్ విజయపతాకం ఎగరవేస్తుందన్నారు. ఆ తర్వాత వచ్చే లోకసభ ఎన్నికల్లోను బీజేపీని ఓడిస్తామని చెప్పారు.