కాంగ్రెస్తోనే నా పెళ్లి, మోడీకి హగ్ నచ్చలేదు: బీజేపీ నుంచి మరో పీఎం అంటూ రాహుల్ షాక్
Recommended Video

హైదరాబాద్: తెలంగాణలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడానికి, పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం సోమవారం హైదరాబాద్ నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం పార్టీ శ్రేణులు, ప్రజలతో సమావేశమైన రాహుల్ గాంధీ.. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు చేశారు.
రెండోరోజైన మంగళవారం కూడా ఆయన నగరంలో వరుస సమావేశాలతో బీజీగా గడుపుతున్నారు. మంగళవారం ఉదయం పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించారు.

కలిసికట్టుగా పనిచేయండి
రాబోయే రోజుల్లో చేపట్టబోయే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో దిశా నిర్దేశం చేశారు. దీనిపై పవర్పాయింట్ ప్రజంటేషన్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అలాగే బూత్లెవల్స్లో చేపడుతున్న కార్యక్రమాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. టెలీకాన్ఫరెన్స్ తర్వాత 40మంది కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంతోపాటు తెలంగాణలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తోంది. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

మోడీని కాదు.. సిద్ధాంతమే వ్యతిరేకం
రాహుల్ తర్వాత పత్రికలు, టీవీ ఛానెళ్ల ఎడిటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ హయాంలో పత్రికలు, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీని కాదు.. ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తానని రాహుల్ తెలిపారు.

నా కౌగిలింత ఆయనకు నచ్చలేదు
నరేంద్ర మోడీ ప్రత్యర్థులకు కనీస గౌరవం కూడా ఇవ్వరని రాహుల్ ఆరోపించారు. లోక్సభలో మోడీకి తన కౌగిలింత నచ్చలేదని చెప్పారు. 33శాతం మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు.

తెలంగాణలో ఖాయం, ఏపీలో ఇప్పుడే కాదు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడతామని అన్నారు. ఏపీలో ఇప్పుడే అధికారంలోకి వచ్చే అవకాశం లేదని రాహుల్ చెప్పారు. పొత్తులపై స్థానిక పీసీసీలే నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. విభజన హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు. హిందుత్వ విధానంపై తనకు నమ్మకం లేదని రాహుల్ తెలిపారు.

కాంగ్రెస్తోనే పెళ్లి..
మీడియా ఎడిటర్లతో సమావేశం సందర్భంగా రాహుల్ గాంధీ తన పెళ్లి విషయంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో తన పెళ్లి అయిపోయిందని చెప్పారు. పార్టీ విధానాలను విస్తరించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని రాహుల్ తెలిపారు.

మోడీ కాదు.. బీజేపీ నుంచి మరో పీఎం..
నరేంద్ర మోడీ ఊహల్లో బతుకుతున్నారని రాహుల్ ఆరోపించారు. 2019లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశం లేదని అన్నారు. 230సీట్లు బీజేపీకి వస్తేనే మోడీ పీఎం అవుతారని అన్నారు. యూపీ, బీహార్ పొత్తుల వల్ల బీజేపీకి 230సీట్లు రావని జోస్యం చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ మరొకరిని ప్రధానిగా నిలుపుతుందని రాహుల్ గాంధీ చెప్పడం గమనార్హం.

పారిశ్రామికవేత్తలతో భేటీ.. నారా బ్రాహ్మణి హాజరు
కాగా, మంగళవారం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలు, యువ సీఈవోలతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి, హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి హాజరయ్యారు. కాగా, మధ్యాహ్నం 2.30 గంటలకు గన్పార్క్ వరకు బస్సు యాత్ర నిర్వహిస్తారు. అక్కడ తెలంగాణ అమరవీరులకు రాహుల్ నివాళులు అర్పిస్తారు. సాయంత్రం నాలుగున్నరకు సరూర్ నగర్ స్టేడియానికి బస్సు యాత్ర మొదలవుతుంది. ఐదున్నర గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో విద్యార్థి నిరుద్యోగ గర్జనలో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. మంగళవారం రాత్రి ఆయన తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.












Click it and Unblock the Notifications