మేనల్లుడితో వచ్చి తెలంగాణ వంటలను రుచి చూసిన రాహుల్
న్యూఢిల్లీ: ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ వంటకాల రుచి చూశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్కు వచ్చి క్యాంటీన్లో భోజనం చేసి వెళ్లారు. ఆయన వెంట సోదరి ప్రియాంక వాధ్రా కుమారుడు, నలుగురైదుగురు ఎస్పీజీ సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాహుల్ ఈ భవనానికి రావడం ఇదే మొదటిసారి.
గతంలో 2009లో తెలంగాణ ఉద్యమంపై కాంగ్రెస్లోనూ, యూపీఏ-2 ప్రభుత్వంలోనూ ఎలాంటి సందడి లేనప్పుడు ఈ క్యాంటీన్లో భోజనం చేశారు. మళ్లీ ఆరేళ్ల తరువాత ఆయనకు తెలంగాణ వంటకాలు తినాలనిపించినట్లుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టుకు హాజరు కావడంపై కొన్ని రోజులుగా చాలా తీరిక లేకుండా ఉన్న రాహుల్ ఆదివారం ప్రశాంతంగా కనిపించారు.
ఒక సాధారణ పౌరుడి మాదిరిగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా ఆయన క్యాంటీన్కు వచ్చారు. ఈ సమాచారం బయటకు పొక్కకూడదన్న ఉద్దేశంతో కావచ్చు పోలీసులు ఆయనకోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో హడావిడి చేయలేదు.

మీడియాకు కూడా ఈ సమాచారం తెలియకుండా జాగ్రత్తపడ్డారు. రాహుల్ చకచకా తెలంగాణ భవన్ మెట్లెక్కి క్యాంటీన్ ఉన్న మొదటి అంతస్తుకు వెళ్లారు. అప్పటికే అక్కడ కొద్దిమంది భోజనం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని ఆర్డర్ ఇచ్చి అల్లుడితో మాటల్లో మునిగిపోయారు.
తెలంగాణ బిర్యానీతో పాటు వివిధ మాంసాహార వంటకాలను వారు భుజించారు. సుమారు అరగంట పాటు డైనింగ్ హాల్లోనే ఉన్న రాహుల్ను చూసి అక్కడున్నవారిలో కొందరు మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత చూద్దామని సెక్యూరిటీ సిబ్బంది ద్వారా వారికి చెప్పారు.
భోజనం అనంతరం మేడ దిగి వచ్చాక కొందరికి తనతో సెల్ఫీలు దిగేందుకు అవకాశం ఇచ్చి తరువాత వెళ్లిపోయారు. రాహుల్ వెంట ఉన్నది ప్రియాంక కుమారుడని ఈ సందర్భంగా చాలామంది గుర్తించలేదు.












Click it and Unblock the Notifications