రైల్వే శాఖ కొత్త యాప్: కాగితం లేకుండా రైలు టిక్కెట్ బుక్ చేయ్యొచ్చు
సికింద్రాబాద్: భారత ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా దక్షిణమధ్య రైల్వే టెక్నాలజీని అందిపుచ్చుకుని కాగితం లేకుండా రైలు టిక్కెట్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్లు టిక్కెట్లతో అపరిశుభ్రం కాకుండా స్మార్ట్ఫోన్లలో టిక్కెట్ బుక్ చేసుకునేలా ఓ సరికొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ సరికొత్త యాప్ను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీ నుంచి రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఓ కార్యక్రమంలో 'పేపర్లెస్ అన్రిజర్వడ్ టిక్కెట్'కు సంబంధించిన యాప్ పని చేసే విధానాన్ని ఎంపీ వీహెచ్తో కలిసి ఎస్సీఆర్ జీఎం రవీంద్రగుప్తా వివరించారు.
ఎంఎంటీఎస్లో ప్రయాణించే ప్రయాణికులకు ఈ యాప్ ఎంతో మేలు చేస్తుంది. ఉదాహరణకు ఎంఎంటీఎస్లో ప్రయాణించే ప్రయాణికుల వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే శ్రమ లేకుండా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్లో లభ్యమయ్యే ఈ యాప్ను అన్ని అండ్రాయిడ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.

అదే విధంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్లలోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సేవలను అందించడం బాగుందన్నారు. రైళ్ల బోగీల్లో ఎప్పటికప్పుడు శుభ్రమైన వాతావరణం ఉండేలా తనిఖీలు చేయాలన్నారు.
ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులకు ‘హైలైట్స్' ద్వారా రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని అందించామని, ఇప్పుడు టిక్కెట్ శ్రమ లేకుండా బుక్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చామని జీఎం చెప్పారు. అంతేకాదు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలో 70 ఆటోమెటిక్ టిక్కెట్ వెండింగ్ మెషిన్లు(ఏటీవీఎంలు) పెడుతున్నట్టు ఆయన తెలిపారు.
యాప్ ఎలా పనిచేస్తుంది:
* పేపర్లెస్ అన్రిజర్వుడ్ టిక్కెట్స్ యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని http://www.utsonmobile.indianrail.gov.in వెబ్సైట్లో మీ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి.
* టిక్కెట్లను కొనేందుకు ఆర్ వ్యాలెట్లో కనీసం రూ.100, గరిష్ఠం రూ.5 వేలు రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంఎంటీఎస్ రైలు, సీజన్, ప్లాట్ఫాం టిక్కెట్లను యాప్ ద్వారా పొందవచ్చు.
* రైల్వే స్టేషనుకు 15 మీటర్ల దూరం నుంచి మాత్రమే టిక్కెట్ బుకింగ్ సాధ్యమవుతుంది.
* ప్లాట్ఫాం టిక్కెట్ను రెండు కిలోమీటర్ల దూరం నుంచి తీసుకోవచ్చు. సీజన్ టిక్కెట్ను 10 రోజుల ముందుగా రెన్యువల్ చేసుకోవచ్చు.
ముందుగా యాప్లో లాగిన్ అవ్వాలి:
* ‘బుక్ టిక్కెట్' నుంచి ‘నార్మల్ బుకింగ్' ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి.
* ప్రయాణ వివరాలు నమోదు చేసి ‘డన్' నొక్కాలి.
* టిక్కెట్ ధరతో పాటు, ఖాతాలో డబ్బుల వివరాలను చూపిస్తుంది.
* ఈ యాప్ ద్వారా సికింద్రాబాద్, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా నగరాల్లోని సబర్బన్ రైళ్లకు టిక్కెట్లను కొనుక్కోవచ్చు.












Click it and Unblock the Notifications