సారిక మృతి: పారిపోయిన అనిల్ రెండో భార్య సన ఖమ్మంలో అరెస్టు
వరంగల్/ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో ఏ4 నిందితురాలుగా ఉన్న సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సనను ఖమ్మంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించవలసి ఉంది. రాజయ్య తనయుడు అనిల్.. సారికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అనిల్.. సనతో వివాహేతర సంబంధం పెట్టుకొని, ఆ తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు.
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, భార్య మాధవి, కుమారుడు అనిల్ వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. సారికది ఆత్మహత్యేనని పోలీసులు రిమాండ్ నివేదికలో పొందుపరిచారు. అత్తమామ, భర్త అనిల్, సన వేధింపుల వల్లనే సారిక తన ముగ్గురు పిల్లలతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. సిలిండర్ను తన గదిలోకి తీసుకెళ్లి లీక్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.