అందుకే సీఎం కాలేకపోయాను..! బాబు వల్లే సదానందగౌడను.. : డీఎస్
హైదరాబాద్ : హైకోర్టు విభజనకై పట్టుబడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. విభజనకు ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా హైకోర్టు విభజనపై స్పందించిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
హైకోర్టు విభజనకు కొర్రీలు పెడుతున్న చంద్రబాబు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. చంద్రబాబు వల్లే హైకోర్టు విభజనలో జాప్యం తలెత్తుతోందని ఆరోపించిన ఆయన, హైకోర్టు విభజనను చంద్రబాబే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 'ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి సదానందగౌడనే తమతో వెల్లడించారని.. విషయం చంద్రబాబుకు తెలిసి, బీజేపీ నేతలతో సహకారంతో సదానందగౌడ శాఖనే మార్చివేశారని' ఆరోపించారు.
పాలనా విభాగాలను వీలైనంత త్వరగా కొత్త రాజధానికి తరలించాలని భావిస్తోన్న చంద్రబాబు, హైకోర్టు విభజనకు మాత్రం ఎందుకు ఒప్పుకోవట్లేదని నిలదీశారు డీఎస్. తొమ్మిదేళ్ల పాటు తెలంగాణకు కూడా సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు.

అందుకే సీఎం కాలేకపోయా :
కాంగ్రెస్ లో కొందరు నేతలు తనను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేశారని, సదరు నేతలతో పొసగకనే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు డీఎస్. అలాగే గత దివం గత సీఎం వైఎస్ గురించి ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 25 ఏళ్లు కష్టపడి సీఎం అయ్యారని చెప్పారు. సీఎంగా ఐదేళ్ల పదవి కాలానికే వైఎస్ చనిపోవడం దురదృష్టకరమన్న డీఎస్.. 'ఆయన మరణించిన సమయంలో తాను ఎమ్మెల్యేగా లేకపోవడం వల్లే సీఎం కాలేకపోయానన్నారు'.
అయితే సీఎం కాకపోవడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ఇక తెలంగాణలో రాజకీయ ఫిరాయింపుల గురించి గగ్గోలు పెడుతోన్న విపక్షాలను ఉద్దేశించి.. ఫిరాయింపులు ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదన్నారు డీఎస్. సీఎంగా కేసీఆర్ చేపడుతున్న ప్రతీ పనికి ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని, ఆ తీరు నచ్చకనే మిగతా పార్టీ నేతలంతా టీఆర్ఎస్ లొ చేరుతున్నారని వివరించారు డీఎస్. అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించమని కోరుతున్న వారిని తామెలా వద్దనగలమని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications