రాజ్యసభ భయం: రేవంత్-మోత్కుపల్లికి చంద్రబాబు నో వెనుక..!
హైదరాబాద్: గత రాజ్యసభ ఎన్నికల సమయంలో తెలంగాణ టిడిపి నేతలు కూడా రాజ్యసభ సీటును ఆశించారు. టిడిపి - బిజెపిలకు మూడు సీట్లు దక్కనున్న నేపథ్యంలో ఒకటి బీజేపీకి పోగా, మిగిలిన రెండింట్లో ఒకటి తెలంగాణ టిడిపి నేతలకు అవకాశమివ్వాలని ఆ రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ఓ రాజ్యసభ స్థానాన్ని తమ ప్రాంతానికి కేటాయించాలని కోరారు. మోత్కుపల్లి తనకు ఇవ్వాలని అధినేతకు విజ్ఞప్తి చేశారు. కానీ అలా జరగలేదు. అందుకు ఎన్నో కారణాలున్నాయి.
అందులో, ప్రధానంగా జంపింగ్ భయంతోనే చంద్రబాబు తెలంగాణ నేతలకు రాజ్యసభ స్థానం ఇవ్వలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి బీజేపీకి పోగా, రెండోది కేంద్రమంత్రి సుజనా చౌదరికి ఆనాడు ఖాయమైంది. మూడో దానిపై తెలంగాణ టిడిపి నేతలు ఆశలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలో ఆనాడు రావుల చంద్రశేఖర రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాష్ రెడ్డి, రమేశ్ రాథోడ్, ఇనుగాల పెద్దిరెడ్డి తదితర నేతలు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ వారికి కాకుండా చంద్రబాబు మరో నేతకు ఇద్దామని భావించారని వార్తలు వస్తున్నాయి.
అయితే, అదే సమయంలో ఆ నేత పార్టీ మారుతున్నారనే ప్రచారం జరగడంతో రాజ్యసభ పదవి దక్కకుండా పోయిందని అంటున్నారు. చంద్రబాబు మనసులో ఎవరైతే ఉన్నారో.. ఆ నేత ఎర్రబెల్లి దయాకర రావుతో టచ్లో ఉన్నారని చంద్రబాబుకు తెలిసిందని, ఆ కారణంగానే తెరపైకి టీజీ వెంకటేష్ వచ్చారని వార్తలు వస్తున్నాయి.
తీరా సదరు తెలంగాణ నేతకు రాజ్యసభ స్థానం ఇస్తే, ఆ తర్వాత ఆయన పార్టీ మారితే మొదటికే మోసం అనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు పక్కన పెట్టారని అంటున్నారు. చివరకు తెలంగాణ కోటానే పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయితే, ఆయనకు తెలియకుండానే ఈ ప్రచారం జరిగిందనే వాదనలు ఉన్నాయి.