భూత వైద్యులకు పట్టిన భూతాలు ! 22 మందికి వదిలించే పనిలో పోలీసులు !
రామగుండం కమిషనరేట్ పరిధిలో భూత వైద్యం పేరుతో ప్రజల సమస్యలను సొమ్ము చేసుకుంటున్న భూత వైద్యుల భూతాలను వదిలించే పనిలో పడ్డారు పోలీసులు. 22 మంది భూత వైద్యులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తమదైన స్టైల్లో భూత వైద్యుల కు పట్టిన దయ్యాలను వదిలించే పనిలో పడ్డారు పోలీసులు.
రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్ట్ .. బాల్క సుమన్ ఫైర్
భూతవైద్యం పేరుతో మోసాలకు పాల్పడుతున్న 22 మంది భూతవైద్యుల అరెస్ట్
భూత వైద్యుల మోసాలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యలో 22 మందిని అరెస్టు చేసిన పోలీసులు భూత వైద్యం పేరుతో మోసాలకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. పూజల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న భూత వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దయ్యాలు, భూతాలు, క్షుద్ర పూజలు అంటూ ప్రజలను మభ్యపెట్టి వారి నుండి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. తెలంగాణలో కలప స్మగ్లర్ గా తెలంగాణ వీరప్పన్ గా పేరున్న ఎడ్ల శ్రీను నుండే 10 లక్షల రూపాయలు వసూలు చేశారంటే వీరు ఎంతటి ఘటికులో అర్థం చేసుకోవచ్చు.
ఒక్కొక్క భూతవైద్యుడి సంపాదన రోజుకు డెబ్బై వేలు ..
కోళ్లు ,కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గవ్వలు ఇలా ఎవరికి తోచినవి వారు ఉపయోగిస్తూ దయ్యాలు భూతాలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. సమస్యల్లో ఉన్న వారు వీరి వద్దకు వస్తే క్షుద్ర పూజలు అంటూ చేతబడి అంటూ వారిని నమ్మించి వేలకు వేలు వారి వద్దనుండి వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క భూతవైద్యుడు సంపాదన రోజుకు 70 వేలు ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ భూత వైద్యుల భరతం పట్టడానికి రామగుండం కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
రామగుండం కమీషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ .. 22మంది అరెస్ట్ .. పీడీ యాక్ట్ పెడతామని వార్నింగ్
ఏకకాలంలో టాస్క్ ఫోర్స్, సిసిఎస్, ఇతర పోలీసులు బృందాలుగా ఏర్పడి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 22 మంది దొంగ బాబాలను, క్షుద్ర పూజలు చేసే వారిని అరెస్టు చేశారు. ఇక వారికి తమదైన స్టైల్ లో క్లాస్ ఇచ్చిన పోలీసులు భూత వైద్యం పేరుతో ప్రజలను భయపెట్టి, వారి నుండి డబ్బులు వసూలు చేసే సహించేది లేదని చెప్పారు. పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తా మంటూ హెచ్చరికలు జారీ చేశారు. పద్ధతి మార్చుకోకుంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటూ స్పెషల్ డ్రైవ్ చేసిన పోలీసులు భూత వైద్యుల భూతాలను వదలగొట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా డ్రైవ్ అవసరం .. దొంగబాబాలకు చెక్ పెట్టటం అనివార్యం
ఇక రామగుండం పోలీసుల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రాల పేరుతో , భూత వైద్యం పేరుతో మోసం చేస్తున్న దొంగ బాబాలకు చెక్ పెడితే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మూఢవిశ్వాసాలను ఆసరా చేసుకొని ఇలాంటి దోపిడీలకు పాల్పడే దొంగ బాబాలు రెచ్చిపోతున్నారని ఇక వీరందరికీ రామగుండం పోలీసుల తరహాలో స్పెషల్ క్లాస్ ఇవ్వాల్సి ఉందని భావిస్తున్నారు.