ఈటల చుట్టూ ర్యాలీ అవుతున్న కీలక నేతలు..? రాములు నాయక్ భేటీ... టచ్లో టీఆర్ఎస్ కీలక నేత...
భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొత్త పార్టీనా.. లేక మరో పార్టీలో చేరడమా అన్న మీమాంసపై ఆయన ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అదే సమయంలో అన్ని పార్టీల్లోని రాజకీయ మిత్రులు,తన శ్రేయోభిలాషులతో విస్తృత సమావేశాలు జరుపుతున్నారు. కేసీఆర్పై యుద్ధమంటే ఆషామాషీ కాదు కాబట్టి ఆచీ తూచీ ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఇద్దరు కీలక నేతలు ఈటల మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ నేత రాములు నాయక్ మంతనాలు
కాంగ్రెస్ నేత,మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఈటల రాజేందర్తో భేటీ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారులోని శామీర్పేటలో ఉన్న ఈటల నివాసానికి వెళ్లిన రాములు నాయక్ ఆయనతో గంటన్నరకు పైగా మంతనాలు జరిపినట్లు సమాచారం. శుక్రవారం(మే 7) మధ్యాహ్నం 1.30గం. నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది.
భేటీ అనంతరం ఈటల కార్యకర్తల సమావేశంలో పాల్గొనగా... రాములు నాయక్ తన కారులో వెళ్లిపోయినట్లు సమాచారం. ఈటల భవిష్యత్ కార్యాచరణపై రాములు నాయక్ ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈటల కొత్త పార్టీ పెడితే రాములు నాయక్ ఆయన వెంట నడిచే ఆలోచనలో ఉన్నారా అన్న ఊహాగానాలకు ఈ భేటీ ఊతమిచ్చినట్లయింది.

ఈటలతో టచ్లో టీఆర్ఎస్ నేత
టీఆర్ఎస్కు చెందిన కీలక నేత,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈటలతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆయన స్వయంగా ఈటలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈటల వెంట నడిచే ఉద్దేశంతోనే రవీందర్ రెడ్డి ఆయనతో భేటీ అయినట్లు ప్రచారం సాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీలో తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందని రవీందర్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన సురేందర్ను పార్టీలోకి తీసుకున్నప్పటి నుంచి తన రాజకీయ భవిష్యత్పై ఆయన ఆందోళనలో ఉన్నారు.

అసంతృప్తిలో రవీందర్ రెడ్డి
అధిష్ఠానం నుంచి ఇప్పటివరకూ తనకెలాంటి భరోసా లభించకపోవడం... గతంలో ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించినా సఫలం కాకపోవడంతో టీఆర్ఎస్ నాయకత్వంపై ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టీఆర్ఎస్లో తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో ఇక తాడో పేడో తేల్చుకోవాలని ఆయన అనుచరులు రవీందర్ రెడ్డితో చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రవీందర్ రెడ్డి ఈటలతో భేటీ అయి ఆయనతో కలిసి నడుస్తానన్న సంకేతాలు పంపించారన్న ప్రచారం జరుగుతోంది.
Recommended Video

ఇప్పటికైతే ఎటూ తేలని భవితవ్యం...
ఈటలపై వేటు పడి వారం రోజులు గడిచిపోయినా ఇప్పటికైతే ఆయన నుంచి భవిష్యత్ యాక్షన్ ప్లాన్పై ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రెస్మీట్లలోనూ కేసీఆర్పై ఆయన పదునైన విమర్శలేమీ చేయట్లేదు. అవసరమైతే రాజీనామా చేస్తానని ప్రకటించినప్పటికీ ఇప్పటికైతే అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. దీంతో ఈటల భవిష్యత్ వ్యూహమేంటన్నది సర్వత్రా హాట్ టాపిక్గా మారింది.
ఆయన కొంత పార్టీ పెడుతారని... లేదు బీజేపీలో చేరవచ్చునని... ఇప్పటికైతే ఇవే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుశా మరికొద్ది రోజుల్లోనే ఈటల ఈ ఊహాగానాలకు తెరదించి తన కార్యాచరణ ప్రకటించే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications