ఫ్లై ఓవర్ నుంచి కింద పడిన లారీ: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన టిప్పర్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఘోర ప్రమాదం తప్పింది. ఫ్లై ఓవర్ మీద వెళ్తున్న లారీ అదుపు తప్పి కింద పడిపోయింది. శనివారంనాడు ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ పడిన సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇటీవల ఇదే ఫ్లైఓవర్పై డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తూ వచ్చిన ఓకారు అదుపుతప్పి మరో కారుపై పడిన ఘటనలో చిన్నారి రమ్య సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు లారీ ఫ్లై ఓవర్ నుంచి కింద పడి దిగ్భ్రాంతిని కలిగించింది.
ఇదిలావుంటే, గోల్కొండ సమీపంలోని రాందేవ్గూడలో జరిగిన రోడ్డు ప్రమాదంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గత ఏడాది సెప్టెంబర్లో ఇదే ప్రాంతంలో ఓ లారీ పోలీస్ ఔట్ పోస్టు మీదికి దూసుకువచ్చిన సంఘటనలో ఓ కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదం కూడా అక్కడే జరిగింది. ప్రమాద స్థలంలో స్థానిక యువకులు వెంటనే స్పందించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
పక్కన బస్సును అపితే...
ఫలక్నుమా డిపోకు చెందిన 66 జి రూట్ మినీ బస్సు సుమారు 40 మంది ప్రయాణికులతో చార్మినార్ నుంచి లంగర్హౌస్, రాందేవ్గూడ మీదుగా గోల్కొండకు వెళ్తోంది. ఈ క్రమంలో రాందేవ్గూడ వద్ద బస్టాప్లో ప్రయాణికులను దించడానికి డ్రైవర్ మహ్మద్ ఇబ్రహీం బస్సును ఆపాడు.
టిప్పర్ ఇలా..
నార్సింగి వైపు నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఆగిన ఈ బస్సును బలంగా ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఒక్క సారి బస్సు కుదుపునకు గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న మహ్మద్ సర్వర్(15), షోయబ్(20), అమీనాబీ(55), అపర్ణ(19)శివప్రసాద్(22), సయ్యద్ ఫయాజ్, మహ్మద్ ఇర్పాన్(20), మహ్మద్ ఫయాజ్అలియాస్ తాహెర్(40)కు గాయాలయ్యాయి.
ఉస్మానియాలో చికిత్స
సయ్యద్ ఫయాజ్, మహ్మద్ ఇర్పాన్, మహ్మద్ ఫయాజ్అలియాస్ తాహెర్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పరిస్థితి అదుపులోకి తెచ్చారు..
ప్రమాదం గురించి తెలుసుకున్న ఆసిఫ్నగర్ ఏసీపీ గౌస్ మోహిఉద్దీన్, ఇన్స్పెక్టర్ సయ్యద్ ఫయాజ్, అదనపు ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సుమారు 4 గంటల తర్వాత ప్రమాద స్థలం నుంచి పోలీసులు బస్సును, టిప్పర్ను తొలగించారు.
11 మందికి గాయాలు
బస్టాప్లో ఆగిన మినీ ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 11 మంది ప్రయాణికులకు గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాదులోని గోల్కొండ పీఎస్ పరిధిలో శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది.
తీవ్ర ఉద్రిక్తత
సుమారు రెండు గంటల సేపు ఘటనా ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సకాలంలో అక్కడకు చేరుకున్న లంగర్హౌస్ 108 సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి గోల్కొండ ఇన్స్పెక్టర్ సయ్యద్ ఫయాజ్ వివరించారు.