ఆర్టీసీ బస్సు బోల్తా, ఒకరు మృతి: బాలికను గర్భవతి చేసిన కామాంధుడి అరెస్ట్
హైదరాబాద్: బాలికను గర్భవతిని చేసిన కేసులో ఓ కామాంధుడిని సోమవారం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం మాదాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక చందానాయక్ తండాలో నివాసం ఉంటోంది.
రోజూ స్కూల్కు వెళ్లే క్రమంలో బాలికకు పశ్చిమ బెంగాల్కు చెందిన దిలీప్ సర్కార్(39)తో పరిచయం ఏర్పడింది. మాదాపూర్లో రెస్టారెంట్ నిర్వహించే అతడు బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. దీంతో గతేడాది నవంబర్ 28న బాలిక ఆడశిశువుకు జన్మనిచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న దిలీప్ సర్కార్ పరారయ్యాడు. దీంతో నిందితుడిని హైదరాబాద్ పోలీసులు కోల్కత్తాలో అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. సోమవారం అతడిని రిమాండ్కు తరలించారు. అంతకముందే వివాహమైన దిలీప్ సర్కార్కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఆర్టీసీ బస్సు బోల్తా: ఒకరు మృతి
ఆర్టీసీ బస్సు బోల్తాపడి ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని బెజ్జూరు మండలంలోని నామానగర్ వద్ద మంగళవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే కాగజ్నగర్ నుంచి బెజ్జూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు నామానగర్ గ్రామ సమీపంలోని ఓ బ్రిడ్జి పైనుంచి ఆదుపు తప్పి బోల్తా పడింది.
దీంతో అందులో ప్రయాణిస్తున్న 15మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాగజ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తెలుగుపల్లికి చెందిన ఆలం శ్రీనివాస్(35)గా పోలీసులు గుర్తించారు.