జంప్ జిలానీలదే హడావుడి: రావుల, కాంగ్రెస్ నేతలవి చిల్లర రాజకీయాలు: కర్నె
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆయుత చండీయాగం వద్ద ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన నేతలే ఎక్కువ హడావుడి చేశారని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా పోలింగ్ సమయంలో కూడా టీడీపీకి చెందిన వారిని ఎత్తుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదువు కూడా సరిగా రాని ఎంపీటీసీలు ఫైవ్ స్టార్ హోటళ్లలో కూర్చొని ఏం చేస్తారో ఎన్నికల ప్రధాన అధికారికి తెలియదా? అంటూ ప్రశ్నించారు. మంత్రులు కేటీఆర్, హరీష్రావులు ఫిరాయింపుల యాగం చేశారని ధ్వజమెత్తారు. యాగం పూర్తయిందని, యాగం మూడ్ నుంచి బయటకు వచ్చి, పాలనపై దృష్టిసారించాలని కేసీఆర్కు ఆయన హితవు పలికారు.
హైదరాబాద్లో సమాధి రాళ్లు వేశారు: కర్నె
కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పునాది రాళ్లు వేస్తోంటే, కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లో సమాధి రాళ్లు వేశారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వేషాలు మానుకుని ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులకు సహకరించాలని ఆయన హితవు పలికారు.