దిశ ఎన్కౌంటర్ నిందితులకు మరోసారి పోస్టుమార్టం... అనంతరమే అంత్యక్రియలు
దిశ ఎన్కౌంటర్ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ జేసింది. అయితే ఈ పోస్టుమార్టంను తెలంగాణ వైద్యులకు సంబంధం లేకుండా ఉన్న ముగ్గురు ఫోరెన్సిక్ నిపుణుల చేత జరిపించడంతో పాటు పోస్ట్మార్టం మొత్తాన్ని వీడీయో తీయించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా మొత్తం ప్రక్రియను 23 సాయంత్రం అయిదు గంటలలోగా పూర్తి చేసి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించలని వైద్యశాఖ ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
దిశ నిందితుల మృతదేహాలు కుళ్లిపోయాయి: హైకోర్టుకు చెప్పిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్
మృతదేహాల అప్పగింతపై కోర్టులో వాదనలు
దిశ నిందితుల ఎన్కౌంటర్ అంశాన్ని హైకోర్టు సీరియస్గా తీసుకుంది. ఎన్కౌంటర్ పై అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రత్యేక కమీషన్ వేయడంతో... నిందితుల మృతికి సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మృతదేహాల అప్పగింత, రీపోస్ట్మార్టంపై రెండో రోజు హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ పై ఏర్పాటు చేసిన కమిషన్ ఇంకా రాష్ట్రానికి రాకపోవడంతో పాటు మరోవైపు మార్చురిలో ఉన్న మృతదేహాలు కుళ్లిపోతుండడంతో హైకోర్టులో విచారణ కొనసాగింది. దీంతో మొత్తం ఎన్కౌంటర్కు గురైన నలుగురి మృతదేహలకు రీపోస్ట్మార్టం చేసి నివేదికను సీల్డ్కవర్లో కోర్టుకు అందించాలని ఆదేశాలు జారి చేసింది.
తెలంగాణ వైద్యుల చేత రీపోస్టుమార్టంకు నిరాకరణ
ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నిందితులకు మహాబుబ్నగర్ ఆసుపత్రిలో రాష్ట్ర వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి నిందితుల రీపోస్టుమార్టంను తెలంగాణ వైద్యుల చేత చేయించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోర్టును కోరింది. అయితే ఇందుకు సంబంధించి కోర్టు నిరాకరించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యుల బృందం కావడంతో కొంత అనుమానాలు రేకెత్తుతున్నాయని..విచారణ నిష్పాక్షపాతంగా కొనసాగించేందుకు రాష్ట్రానికి చెందని నిపుణుల చేత రీ పోస్టుమార్టంకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
50 శాతం కుళ్లిపోయిన మృతదేహాలు
ముఖ్యంగా ఎన్కౌంటర్ తర్వాత భద్రపరిచిన మృత దేహాలు 50 కుళ్లిపోయాయని గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ శ్రవణ్ హైకోర్టుకు తెలిపారు. ఇలానే మృతదేహాలు ఉంచినట్టయితే... మరోవారం రోజుల్లో కుళ్లిపోయో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన పోస్టుమార్టం వివరాలను కూడ కోర్టుకు అందించారు. దీంతో మృతదేహాను భద్రపరిచేందుకు ఇతర రాష్ట్రాల్లో ఎవైనా సౌకర్యాలు ఉన్నాయా అంటూ.. సూపరిండెంట్ను ప్రశ్నించింది. అందుకు సంబంధించి తన వద్ద సమాచారం లేకపోవడంతో మృతదేహాలకు రెండు రోజుల్లో పోస్టు మార్టం నిర్వహించి వారి బంధువులకు 23 సాయంత్రం లోగా అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబర్ 6న ఎన్కౌంటర్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశపై అత్యాచారం అనంతరం హత్య చేసిన సంఘటన అంనతరం నిందితుల ఎన్కౌంటర్ డిశంబర్ ఆరున జరిగింది. అయితే చివరి నిమిషంలో ఎన్కౌంటర్ పై అనుమానాలను వ్యక్తం చేస్తూ... మానవహక్కుల సంఘాలతో పాటు, మహిళా సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో బంధువులకు అప్పగించాల్సిన మృతదేహాలు గాంధీ మార్చురిలో భద్రపరిచారు. నిందితులు మృత్యువాత పడి పదిహేను రోజులు గడిచిన అనంతరం వారి కుటుంబాలకు అప్పగించనున్నారు.