రియల్ దగా.. ఫోర్జరీ సంతకాలతో కోటి 30 లక్షలు స్వాహా..!
నల్గొండ : నమ్మకమే పెట్టుబడిగా సాగే భాగస్వామ్య వ్యాపారంలో ఒడిదొడుకులు వచ్చాయి. తొమ్మిది మంది కలిసి పార్ట్నర్స్గా ప్రారంభించిన స్థిరాస్థి వ్యాపారంలో రియల్ దగా జరిగింది. ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఇతర భాగస్వాములను మోసం చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఫోర్జరీ సంతకాలతో మోసం చేసి కోటి ముప్పై లక్షల రూపాయలు నొక్కేయడం హాట్ టాపికయింది.
టిక్టాక్లో కొత్త పైత్యం.... కుక్కలా ఎక్స్ప్రెషన్స్.... చూస్తే భయమే....!
భాగస్వాములకే కుచ్చుటోపి.. కోటి ముప్పై లక్షలు హాంఫట్
నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలంలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన మండలాధ్యక్షుడు శాగం రాఘవరెడ్డితో పాటు అదే గ్రామానికి చెందిన నాగండ్ల కృష్ణారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని డిసైడయ్యారు. ఆ క్రమంలో మరో ఏడుగురిని భాగస్వాములుగా చేసుకుని సంస్థగా ఏర్పడ్డారు. దాంతో హాలియా బస్ స్టాండ్ సమీపంలోని మహావీర్ కాంప్లెక్స్ పేరిట నూతన బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు.
మొత్తం తొమ్మిది మంది పార్ట్నర్స్గా ఏర్పడ్డ భాగస్వామ్య కంపెనీ పేరుతో బ్యాంకులో జాయింట్ ఖాతా తెరిచారు. అందులో శాగం రాఘవరెడ్డి, నాగండ్ల కృష్ణారెడ్డి, కాంసాని సాంబ శివారెడ్డి, మల్లు కృష్ణారెడ్డి నలుగురి పేరిట జాయింట్ ఖాతాను తెరిచి చెక్బుక్ తీసుకున్నారు. ఈ నలుగురు సంతకాలు చేస్తే తప్ప కంపెనీకి సంబంధించిన లావాదేవీలు జరగకుండా ఒప్పందం చేసుకున్నారు.
ఫోర్జరీ సంతకాలు.. పార్ట్నర్స్కు చెప్పకుండా
అదలావుంటే తమ కంపెనీ తరపున నిర్మిస్తున్న మహావీర్ కాంప్లెక్స్ బిల్డింగ్ నిర్మాణానికి డబ్బు అవసరమొచ్చి నల్గొండలోని సిండికేట్ బ్యాంకు అధికారులను కలిశారు. ఆ క్రమంలో వీరి సంస్థకు రెండు కోట్ల రూపాయల రుణం మంజూరైంది. సిండికేట్ బ్యాంకు నుంచి తమ జాయింట్ ఖాతాలోకి 2 కోట్ల రూపాయలు జమైన విషయం తెలుసుకున్న శాగం రాఘవరెడ్డి, నాగండ్ల కృష్ణారెడ్డి మిగిలిన మరో ఇద్దరి సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేశారు. అలా సంతకాలు చేసిన చెక్కులతో బ్యాంకు నుంచి కోటి ముప్పై లక్షలు విత్ డ్రా చేశారు. తోటి భాగస్వాములకు చెప్పకుండానే డబ్బులు డ్రా చేయడం అప్పట్లో దుమారం రేపింది.
2014-15లో సంస్థలోని మరో ఏడుగురు పార్ట్నర్స్కు తెలియకుండా ఈ ఇద్దరు కలిసి అంత పెద్దమొత్తం నొక్కేశారు. బ్యాంకు అధికారులు కూడా అంత పెద్ద మొత్తం తీసుకుంటున్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ సంతకాలు నిజంగా చేసినవేనా.. ఫోర్జరీ జరిగిందా అనే విషయాలు నిర్ధారించుకోకుండా నగదు విత్డ్రాకు సహకరించారనే అపవాదు మూటగట్టుకున్నారు.
చెక్కుపై సంతకాలు ఫోర్జరీగా తేల్చిన ఫోరెన్సిక్ నిపుణులు
అదలావుంటే మిగతా భాగస్వాములకు ఈ విషయం తెలియదు. అయితే బ్యాంకు రుణం వచ్చాక కూడా సదరు కాంప్లెక్ నిర్మాణం నెమ్మదించడంతో మల్లు కృష్ణారెడ్డి అనే భాగస్వామి నిలదీశారు. డబ్బులు డ్రా చేసిన విషయం దాచిపెట్టిన ఆ ఇద్దరు.. నిర్మాణంలో జాప్యం జరిగిన దానికి సమాధానం ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చారు. ఆ క్రమంలో శాగం రాఘవరెడ్డి, నాగండ్ల కృష్ణారెడ్డితో మల్లు కృష్ణారెడ్డి గొడవ పడ్డారు. ఆ క్రమంలో ఆయనకు డౌట్ వచ్చి బ్యాంకుకు వెళ్లి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.
మల్లు కృష్ణారెడ్డి గట్టిగా అడిగేసరికి అప్పటి బ్యాంకు మేనేజర్ అసలు విషయం చెప్పారట. 2 కోట్ల రూపాయలున్న ఖాతాలోంచి కోటి ముప్పై లక్షలు డ్రా చేసినట్లు నిర్ధారించారు. ఆ మేరకు ఇద్దరి భాగస్వాముల సంతకాలు ఫోర్జరీ అయినట్లు గుర్తించడంతో బ్యాంకు మేనేజర్ 2015లో కేసు పెట్టారు. ఫోర్జీరీ సంతకాలు చేసిన చెక్కులను హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడంతో గుట్టు రట్టైంది. ఆ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు శాగం రాఘవరెడ్డిని అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు నాగండ్ల కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.