నిజంగా సిగ్గుచేటు.. హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్, ఈసీకి రిక్వెస్ట్!!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోగా తెలంగాణ రాష్ట్రంలో కాస్త ప్రశాంతంగానే పోలింగ్ సాగుతుంది. చిన్న చిన్న ఘటనలు మినహాయించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా నగరాలు, పట్టణ ప్రాంతాలలో పోలింగ్ శాతం తగ్గడం కాస్త ఆందోళన కలిగిస్తుంది.
ఓటేసిన మంచు లక్ష్మి
ఓటు వేయాల్సిన బాధ్యత ఉన్న ఓటర్లు ఓటు వేయకపోవడం కాస్త నిరాశకు గురిచేస్తుంది. ఓవైపు సినీ సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వజ్రాయుధం లాంటిదని ఎంత చెబుతున్నప్పటికీ ఇంకా చాలామందిలో నిర్లిప్తత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలలో ఓటు వేయడానికి ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చిన మంచు లక్ష్మి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటర్లపై మంచు లక్ష్మి ఆగ్రహం
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో సినీ నటి మంచు లక్ష్మి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఓటర్ల పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను ఓటు వేసే సమయానికి చాలా తక్కువ శాతం ఓటింగ్ నమోదు అయిందని తెలుసుకున్న మంచు లక్ష్మి నగర ఓటర్ల పై మండిపడ్డారు. ఇది నిజంగా సిగ్గుచేటని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
ముంబై నుండి వచ్చాను
తాను ఎన్నికల్లో ఓటు వేయడానికి ముంబై నుంచి నగరానికి వచ్చానని చెప్పిన మంచు లక్ష్మి ఓటేయడం అనేది మామూలు హక్కు కాదన్నారు. మన దేశం అభివృద్ధి చెందడానికి, మన వాయిస్ వినిపించడానికి, తప్పకుండా బయటకు వచ్చి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని మంచు లక్ష్మి పేర్కొన్నారు.
ఎన్నికల కమీషన్ కు మంచు లక్ష్మి విజ్ఞప్తి
అయితే ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ కు ఒక విజ్ఞాపన చేసుకున్న మంచు లక్ష్మి తాను ప్రస్తుతం ఓటు వేయడానికి ముంబై నుంచి రావాల్సి వచ్చిందని, తనలాగా ఎంతో మంది ఇతర ప్రాంతాలలో ఉండడం వల్ల ఓటు వేయడానికి వెనక్కి రాలేకపోతున్నారని ఇలా బయట ప్రాంతాలలో ఉండే వారికి ఈజీగా ఓటు వేసేందుకు ఏదైనా మార్గం చూపిస్తే బాగుంటుందనేది నా విన్నపం అని పేర్కొన్నారు.
మీ పవర్ ఏమిటో చూపించండి
మంచు లక్ష్మి తాను ఓటు వేసే సమయానికి హైదరాబాద్ లో 5% ఓటింగ్ జరిగినట్టు తెలిసిందని, ఇది చాలా సిగ్గుచేటని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటు ద్వారా మీ వాయిస్ వినిపించండి.. మీ పవర్ ఏమిటో చూపించండి. ప్రపంచం ఎదురుచూస్తుంది.. బయటకు వచ్చి ఓటెయ్యండి అంటూ మంచు లక్ష్మి హైదరాబాద్ ఓటర్లకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications