హైదరాబాద్లో కాల్పుల కలకలం: రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
హైదరాబాద్: నగర శివారులో కాల్పుల ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో వాహనంపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి రాఘవేందర్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

స్కార్పియోలో రక్తపు మడుగులో రియల్టర్ మృతదేహం
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం కర్ణంగూడకు వెళ్లే మార్గంలో స్థానికులు ఓ స్కార్పియో వాహనాన్ని గుర్తించారు. కారుపై రక్తపు మరకలు ఉండటంతో దగ్గరికి వెళ్లి చూశారు. రక్తపు మడుగులో ఉన్న ఇద్దరు వ్యక్తులను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు.

కాల్పుల్లో రియల్టర్ మృతి, మరో వ్యక్తికి తీవ్రగాయాలు
ఘటనలో తీవ్రంగా గాయపడిన రాఘవేందర్ రెడ్డిని హైదరాబాద్ బీఎన్ రెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన శ్రీనివాస్ రెడ్డి అల్మాస్గూడకు చెందినవాడుగా గుర్తించారు. రాఘవేందర్ రెడ్డిని పరీక్షించిన వైద్యులు అతడి ఛాతీ కింద భాగంలో బుల్లెట్ గాయమైందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
వాహనం నంబర్ ఆధారంగా బాధితుడు అంబర్పేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. అతడి కుటుంబంసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. తొలుత స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగిందని భావించినా.. ఆ తర్వాత కాల్పుల ఘటన అని తేల్చారు.
Recommended Video

రియల్టర్ హత్యకు వెంచర్ విషయంలో గొడవే కారణం?
ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వీరికి ఎవరితోనైనా, ఏమైనా గొడవలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి కుటుంబసభ్యులు పలు కీలక విషయాలను వెల్లడించారు.
పటేల్ గూడలోని 22 ఎకరాల్లో శ్రీనివాస్ రెడ్డి, రాఘేవందర్ రెడ్డి, మట్టారెడ్డి వెంచర్ వేశారు. వెంచర్ విషయంలో ఈ ముగ్గురి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు.
వెంచర్ విషయంలో మాట్లాడదామని వీరిద్దరినీ మట్టారెడ్డి పిలిపించారంటూ బాధితుల కుటుంబసభ్యుల ఆరోపించారు. ఈ కాల్పుల ఘటనలో మట్టారెడ్డి నిందితుడని చెప్పారు. ఈ క్రమంలో మట్టారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications