వరంగల్ సభపై ఉత్కంఠ: రేవంత్ రెడ్డిపై తేల్చేసిన రాహుల్ గాంధీ
తెలుగుదేశం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరడం దాదాపుగా ఖరారైంది. వచ్చే నెల 9వ తేదీ వరంగల్లో జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి భవిష్యత్తును తేల్చే అవకాశం ఉంది. రాహుల
హైదరాబాద్: తెలుగుదేశం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరడం దాదాపుగా ఖరారైంది. వచ్చే నెల 9వ తేదీ వరంగల్లో జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి భవిష్యత్తును తేల్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెసులో చేరుతారని అంటున్నారు.
తనతో పాటు కాంగ్రెసులోకి వచ్చే నాయకుల జాబితాను కూడా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఇచ్చారు. ఆయన 20 మంది పేర్లతో కూడిన జాబితాను సమర్పించినట్లు తెలుస్తోంది. వారెవరనేది కూడా దాదాపుగా తేలిపోయిందని అంటున్నారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి సమర్పించిన జాబితా ఇదేనంటూ పేర్లతో సహా ప్రచారంలోకి వచ్చింది.
రేవంత్ రెడ్డి డిమాండ్లకు దాదాపుగా అంగీకరించడానికి రాహుల్ గాంధీ సిద్ధపడినట్లు చెబుతున్నారు. సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన సీనియర్ నేత వి. హనుమంతరావు రేవంత్ రెడ్డిని ఆహ్వానించాలని చెప్పడాన్ని బట్టే కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం జరిగిపోయినట్లు భావించాల్సి ఉంటుందని అంటున్నారు.

ఆ రోజు కాకపోతే...
ఏవైనా ఆటంకాలు వచ్చి రేవంత్ రెడ్డి నవంబర్ 9వ తేదీన కాంగ్రెసు పార్టీలో చేరలేకపోతే 16, 17 తేదీల్లో స్పష్టత వస్తుందని అంటున్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెసు ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటిస్తారని అంటున్నారు. చేరికపై రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయకపోవడానికి తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదా అని తేల్చుకోవడానికి వేచి ఉండడమే కారణమని అంటున్నారు.

తేల్చి చెప్పిన రాహుల్
రేవంత్ రెడ్డిని తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ సీనియర్ నాయకులకు అవసరమైతే పక్కన పెట్టాలని కూడా రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పార్టీగా విధేయంగా ఉన్నారనో, సీనియర్లనో చూడకుండా వారి అభిప్రాయాలను పక్కన పెడుతూ రేవంత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడానికి ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డిని పార్టీలోకి స్వాగతించాల్సిందేనని ఆయన సీనియర్లకు విజ్ఞప్తిలాంటి హెచ్చరిక చేసినట్లు చెబుతున్నారు.

పార్టీని వీడినా ఫరవా లేదు....
రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం వల్ల సీనియర్లు ఎవరైనా అలిగి పార్టీని వీడినా ఖాతరు చేయకూడదనే కృతనిశ్చయంతో రాహుల్ గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు. అవసరమైతే సీనియర్లను లోకసభకు పోటీ చేయించడం లేదా రాజ్యసభ సీట్లను హామీ ఇవ్వడం చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జానారెడ్డి వంటి నాయకులను పార్లమెంటుకు పోటీ చేయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

చివరి ప్రయత్నంలో కోమటిరెడ్డి బ్రదర్స్
రేవంత్ రెడ్డిని రాకను అడ్డుకోవడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ చివరి ప్రయత్నం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, కోమటిరెడ్డి బ్రదర్స్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. తమ ఇద్దరిలో ఒకరిని ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా ప్రకటించాలని లేదా పిసిసి అధ్యక్షుడిగా చేయాలని పట్టుబడుతూ వస్తున్నారు. వారు బిజెపిలో చేరడానికి కూడా సిద్ధపడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డిని అడ్డుకోవడానికి వారు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడానికి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలనే వారే ఇప్పుడు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications