కరువు సాయం రూ. 2514కోట్లు కోరిన తెలంగాణ: కేంద్రబృందం హామీ(ఫొటోలు)
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితిని పరిశీలించి రూ. 2,514వేల కోట్లు అందించాలని కేంద్ర బృందానికి తెలంగాణ నివేదిక అందించింది. కరవు పరిస్థితి అధ్యయనంలో భాగంగా సోమవారం రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బృందం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమైంది. సిఎస్ రాజీవ్ శర్మతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కేంద్ర బృందానికి రాష్ట్రంలోని కరవు పరిస్థితి వివరించారు.
231 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందించారు. జిల్లాల్లో వాస్తవ పరిస్థితులు చూసి ఇతోదిక సాయం అందించేలా కేంద్రానికి సిఫార్స్ చేయాలని ఈ సందర్భంగా కేంద్ర బృందాన్ని సిఎస్ కోరారు. కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ ఉత్పల్ కుమార్ సింగ్ నేతృత్వంలో కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర బృందంతో వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర అధికారులు సమావేశమయ్యారు.
తెలంగాణలో నెలకొన్న కరవును ఎదర్కోవడానికి 2514 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. దీనికి సంబంధించిన నివేదికలను కేంద్రానికి ఇంతకుముందే అందించినట్టు వివరించారు. వ్యవసాయ శాఖకు 863 కోట్లు, గ్రామీణ మంచినీటి సరఫరాకు 102 కోట్లు, పట్టణ నీటి సరఫరాకు 80 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్కు 134 కోట్లు, పశు సంవర్థక శాఖకు 42, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 369, గ్రాట్యుట్యూయస్ సహాయం కోసం 917 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.
జూన్లో వర్షాలు బాగా కురవడం వల్ల రైతులు పంటలు వేసుకున్నారని, కానీ జూలై, ఆగస్టు మాసంలో వర్షాలులేక పంటలు ఎండిపోయాయని, దిగుబడి పూర్తిగా దెబ్బతిందని సిఎస్ రాజీవ్ శర్మ కేంద్ర బృందానికి వివరించారు. భూగర్భ జల మట్టం గణనీయంగా పడిపోయిందని, ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందించాల్సి వస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితుల ఆధారంగా 231 మండలాలకు సంబంధించి పూర్తి నివేదిక ఇచ్చామని, అవసరమైతే మరింత సమాచారం కోరినవిధంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్ర బృందం జిల్లాల పర్యటన సందర్భంగా అధికారులు అడిగిన సమాచారం ఇస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తామని కేంద్ర జాయింట్ సెక్రటరీ ఉత్పల్ కుమార్ సింగ్ హామీ ఇచ్చారు. దానికి తగినవిధంగా నివేదికలు ఇవ్వాలని అధికారులను కోరారు.
మూడు బృందాల పర్యటన
కేంద్ర బృందంతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో మండలాల వారీగా జూన్నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన వర్షపాత వివరాలు, భూగర్భ జలమట్టం, జలాశయంలో నీటి నిల్వల పరిస్థితి, పంటల వారీ నష్టం, మంచినీటి కొరత, పశుగ్రాసం కొరత, ఉపాధి హామీ ద్వారా అదనపు పని దినాలు, గ్రాట్యుట్యూయిస్ సహాయం తదితర అంశాలపై కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
కాగా, కేంద్రం నుంచి వచ్చిన అధికారులు మూడు బృందాలుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. జి మహారాజకుమార్ బృందం నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో, ఉత్పల్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఒక బృందం మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో, బ్రిజేష్ శ్రీవాత్సవ బృందం నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సోమవారం పర్యటించారు. మంగళవారం కూడా కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి.