నిర్మల్లో రికార్డు స్థాయి వర్షం-గోదావరి పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్-ప్రతీ మున్సిపల్ అధికారి విధుల్లో ఉండేలా
తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు వర్ష సూచన ఉండటంతో ప్రభుత్వం,అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎక్కడెక్కడ సహాయక చర్యలు అవసరమవుతాయో ముందుగానే అంచనా వేసి తదనుగుణంగా చర్యలకు సిద్ధమవుతోంది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల గేట్లు ఎత్తేయాల్సి వస్తుండటంతో ముంపుకు గురయ్యే ప్రాంతాలపై దృష్టి సారించింది. నిర్మల్ జిల్లాలో నీట మునిగిన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను రంగంలోకి దించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

నిర్మల్లో రికార్డు స్థాయిలో వర్షం...
తెలంగాణ వ్యాప్తంగా 44.2 మి.మీ. వర్షపాతం నమోదవగా... ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 115.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 204 మి.మీ. వర్షపాతం నమోదవగా... జిల్లాలోని నర్సాపూర్లో అత్యధికంగా 245మి.మీ వర్షపాతం నమోదైంది. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకూ జిల్లాలో 474.3మి.మీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ చరిత్రలోనే ఇంత భారీ వర్షపాతం మునుపెన్నడూ లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నీట మునిగిన కాలనీల్లో సహాయక చర్యలకు అధికారులను ఆదేశించారు.

ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్,సీఎస్
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం,అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్,చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. . భారీ వర్షాల కారణంగా గోదావరి,కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందునా.. ఆ ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలకు సీఎం ఆదేశించారు.ఆ ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు,మంత్రులు,అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.

కేటీఆర్ కీలక ఆదేశాలు...
నిర్మల్లో స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని సహాయక చర్యలు చేపట్టాలని కేటీఆర్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. హైదరాబాద్లో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గేంతవరకూ మున్సిపల్ శాఖలో ప్రతీ అధికారి విధుల్లో అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

గోదావరి ప్రాంతాల్లో హైఅలర్ట్...
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గోదావరి జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్,కరీంనగర్,నిజామాబాద్,వరంగల్,ఖమ్మం జిల్లాల్లో పరిస్థితులను సమీక్షించారు.ఎక్కడా ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని, వరద ఉధృతి తీవ్రమయ్యే సూచనలు ఉంటే ముందుగానే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించాలని ఆదేశించారు. తాగునీటికి,విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

శ్రీరాం సాగర్ గేట్లు ఎత్తివేత
భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. గోదావరి నదిపై ఉన్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో జలాశయంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 1091 అడుగులు కాగా... ఇప్పటికే 1090 అడుగులకు నీటి మట్టం చేరింది. గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 84.810 టీఎంసీల నీరు ఉంది.దీంతో నీటిని దిగువకు విడుదల చేసేందుకు 8 గేట్లు ఎత్తివేశారు. దిగువకు 50వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 4,32,325 క్యూసెక్కులుగా ఉంది. నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలకు అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.












Click it and Unblock the Notifications