బంగారంతో పోటీపడుతున్న మిర్చి; ఎనుమాముల మార్కెట్ లో క్వింటాల్ 52వేల ధరతో రికార్డు బ్రేక్!!
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి.పసిడితో పోటీ పడుతూ ఎర్రబంగారం దూసుకుపోతుంది. గత కొద్ది రోజులుగా మిర్చి ధరలు ఆకాశాన్నంటడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో క్వింటాల్ ఎర్ర మిర్చి ధర రికార్డు స్థాయిలో 52,000 పలుకుతుంది. బంగారంతో పోటీ పడుతూ మిర్చి ధరలు పెరుగుతున్నాయి.క్వింటాల్ దేశీ మిర్చి 52వేల రూపాయలు పలికింది.
52వేల రూపాయలకు చేరువగా క్వింటాల్ మిర్చి ధర
ప్రతియేడూ వ్యవసాయ మార్కెట్ కు వచ్చిన మిర్చి రైతులు ఆరుగాలం శ్రమించినా పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కానీ ఈసారి మిర్చి సాగు చేసిన రైతన్నల పంట పండింది. బంగారంతో సమాంతరంగా మిర్చి ధర పెరుగుతూ వచ్చింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ మిర్చి ధర 52వేల రూపాయలకు చేరువలో ఉండటం రైతులకు సంతోషాన్నిస్తుంది. రోజురోజుకు దేశీయ మిర్చి రికార్డ్ బ్రేక్ చేస్తుండడంతో మిర్చి సాగు చేస్తున్న రైతులు లాభాలను చవిచూస్తున్నారు.
దిగుబడి తక్కువ వచ్చినా ధరలు బాగా ఉండటంతో రైతులకు ఉపశమనం
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో వెతుకు ఈసారి భారీ ధర పలికింది. చపాటా, సింగిల్ పట్టి, తేజ, వండర్ హాట్, దీపిక, 1048 రకం, 341 రకం మిర్చి వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు వస్తుంది. సింగిల్ పట్టి, చపాటా రకాలను పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. అయితే ఈసారి అకాల వర్షాల కారణంగా మిర్చి పంట బాగా దెబ్బతింది. రైతులకు దిగుబడి తక్కువ వచ్చింది. కానీ అందుకు తగ్గట్టు ప్రస్తుతం రైతులకు మిర్చి మంచి ధర పలుకుతోంది. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మిర్చి బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ధరలు విపరీతంగా పెరిగాయి.
మిర్చితో పాటు పత్తికి రికార్డ్ స్థాయిలో ధర
మిర్చి ధర 37 వేల రూపాయల నుండి ఏకంగా 52 వేల రూపాయలకు పెరగడంతో రైతన్నలు సంతోషంతో ఉన్నారు .మిర్చి ఇంత పెద్ద మొత్తంలో ధర పలకడం ఇదే మొదటిసారి అని రైతులు చెబుతున్నారు. మరోవైపు మిర్చితో పాటు పత్తికి కూడా వరంగల్ మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికినట్లుగా తెలుస్తుంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో పత్తి కి 10,720 రూపాయల ధర పలుకుతోంది. ఇక జమ్మికుంట మార్కెట్లో 10,810 రూపాయల ధర పలికింది .ఖమ్మం లో 10,600 రూపాయల ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది.