టీకా వ్యవధిని తగ్గించండి, వారికి బూస్టర్ డోస్ ఇవ్వండి: కేంద్రమంత్రికి హరీశ్ రావు కీలక సూచనలు
హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య ఉన్న వ్యవధిని తగ్గించాలని మంత్రి హరీశ్రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు శుక్రవారం లేఖ రాశారు.

కరోనా వ్యాక్సిన్ల మధ్య వ్యవధిని తగ్గించండి: కేంద్రమంత్రి హరీశ్ రావు
కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య 12 వారాల వ్యవధి ఉండటంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా రెండో డోసు వేయడం కష్టంగా ఉందని చెప్పారు. వలస కూలీలు మొదటి డోస్ తీసుకొని, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని, వారికి రెండో డోసు వేయడం ఇబ్బందిగా మారిందన్నారు. అంతర్రాష్ట్ర కూలీల విషయంలో మరింత ఇబ్బందులు ఉన్నాయన్నారు. మొదటి డోస్ వేసుకున్నవారి వివరాలు కొవిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నా, ఆ జాబితా ఆ రాష్ట్రానికే పరిమితం కావడంతో వలస కూలీలను అప్రమత్తం చేయలేకపోతున్నట్టు హరీశ్ రావు తెలిపారు.

ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు: కేంద్రానికి హరీశ్ రావు
రెండో డోస్ వ్యవధిని గతంలో మాదిరిగా 4-6 వారాలకు తగ్గిస్తే.. టీకా తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందన్నారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణలో 2.77 కోట్ల మంది టీకాలు తీసుకునేందుకు అర్హులుగా గుర్తించామని, ఇందులో ఇప్పటి వరకు 3.77 కోట్ల డోసులను వేసినట్లు చెప్పారు. హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్స్, హైరిస్క్ గ్రూప్ వారికి రెండో డోసు వేసి 8 నుంచి పది నెలల సమయం గడిచిందని, కొత్త వేరియంట్లు వస్తున్న నేపథ్యంలో వారికి బూస్టర్ డోస్ వేయాలని కేంద్రమంత్రి మాండవీయకు సూచించారు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.

జాగ్రత్తలు తీసుకుంటే ఏ మైక్రాన్ దరిచేరదు: హరీశ్ రావు
కరోనా నిబంధనలు పాటిస్తే ఏ మైక్రాన్ కూడా మన వద్దకు రాదని, డెల్టా, ఆల్ఫా, ఒమిక్రాన్ వేరియంట్ ఏది కూడా మన దరి చేదని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కొంచెం జాగ్రత్త ఉంటే కరోనాను అరికట్టవచ్చన్నారు. టీకాలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. ఓల్డ్ బోయిన్పల్లిలో బస్తీ దవాఖానాను మంత్రి హరీశ్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా 2 కోట్ల 51 లక్షల మంది మొదటి డోసు తీసుకున్నారు. రెండో డోసు కోటి 30 లక్షల మంది మాత్రమే తీసుకున్నారు. చాలా మంది రెండో డోసు తీసుకోలేదు. ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. టీకాలు సురక్షితమైనవి. అనుమానాలు, అపోహాలు అవసరం లేదు. రెండు డోసులు తీసుకుంటే మన ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు మంత్రి హరీశ్ రావు. 18 ఏళ్లు దాటి ప్రతిన ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలి. టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
Recommended Video

తెలంగాణలో మైక్రాన్ లేదు.. ఆమె రిపోర్టు రావాలి: హరీశ్ రావు
ఇప్పటి వరకు ఒమిక్రాన్ తెలంగాణకు రాలేదని హరీశ్రావు స్పష్టం చేశారు. కర్ణాటకలో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ధారించింది. మన హైదరాబాద్లో, తెలంగాణలో దేవుని దయవల్ల రాలేదన్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించామని తెలిపారు. 4-5 రోజుల్లో ఆమెకు ఏ వేరియంట్ సోకింది అనేది తేలిపోతుందన్నారు. మాస్కు ధరించండి.. టీకాలు వేసుకోండి.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. స్వీయ నియంత్రణ పాటించాలి. వీటన్నింటిని పాటిస్తే కరోనాను తరిమికొట్టవచ్చన్నారు మంత్రి. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనా నుంచి రక్షణ పొందవచ్చన్నారు. టీకా తీసుకోనివారు వెంటనే వేసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications