కొందరు ఇప్పుడు మాట్లాడుతున్నారు: కేసీఆర్కు చంద్రబాబు పరోక్ష చురకలు
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ మహానాడులో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్కు పరోక్షంగా చురకలు అంటించారు. కొందరు నాయకులు ఇటీవల కాలంలో కాంగ్రెస్ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక కూటములు అంటూ చెబుతున్నారని, కానీ తాను ఎప్పుడో చేశానని చెప్పారు.
తాను 22 ఏళ్ల క్రితమే యాంటీ కాంగ్రెస్, యాంటీ బీజేపీ కూటమిని, కేంద్రంలో నాడు ఆ మూడో కూటమి అధికారంలో కొనసాగిందని చంద్రబాబు అన్నారు. తాను ఎప్పుడో చేస్తే, ఇప్పుడు కొందరు నేతలు దాని గురించి మాట్లాడుతున్నారన్నారు. 2019 ఎన్నికలు అయ్యాక కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పారు.

తెలంగాణలో ఇక పార్టీని ఎవరూ ఆపలేరు
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమే ఉందని, ఇప్పటి నుంచే సిద్ధం కావాలని చంద్రబాబు నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ మహానాడుతో పార్టీ బలోపేతానికి బలమైన పునాది పడిందని, కష్టపడి పనిచేస్తే రాష్ట్రంలో పార్టీని తిరుగులేని రాజకీయశక్తిగా చేసి చూపిస్తానన్నారు. పద్నాలుగేళ్లుగా అధికారం లేకపోయినా, నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు పార్టీ జెండా మోస్తున్నారన్నారు. ఇక పార్టీని తెలంగాణలో ఎవరూ ఆపలేరన్నారు. ఓ నాయకుడు స్వార్థంతో పార్టీని వీడినా కార్యకర్తలు వదలలేదన్నారు.

కేంద్రంపై ఆగ్రహం
కేంద్రంపై కూడా చంద్రబాబు విరుచుకు పడ్డారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, జీఎస్టీని కూడా సరిగా అమలు చేయలేకపోయిందని, గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందన్నారు. తెలుగుజాతికి, రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేసిందని, వెంకన్న సాక్షిగా ఏపీకి చెప్పిన మాటలు, తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేదన్నారు.

రెండు రాష్ట్రాలు కీలక శక్తిగా తయారు కావాలి
తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే రెండు రాష్ట్రాలు కలిసి కీలకశక్తిగా తయారు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అలా జరుగుతుందన్న నమ్మకం తనకుందన్నారు. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలది సంకీర్ణ ప్రభుత్వమే కావొచ్చునని, కానీ తాను వెళ్లింది కుమారస్వామి ప్రమాణస్వీకారానికి అన్నారు. బెంగళూరులో జరిగిన ఆ కార్యక్రమానికి వచ్చిన ఇతర పార్టీల నాయకులతో మాట్లాడానని, వారంతా కలిసి తెలుగుజాతికి న్యాయం చేసే రోజు వస్తుందని, అందరినీ కూడగట్టి న్యాయం జరిగేవరకు ధర్మపోరాటం చేస్తామన్నారు.

వెంకన్నతో పెట్టుకుంటే మీ పని ఖతం
తనకు రెండుసార్లు ప్రధాని పదవి అవకాశం వచ్చిందని, కానీ తెలుగు ప్రజల కోసం వద్దని చెప్పానని చంద్రబాబు అన్నారు. తనను నియంత్రించలేక అవినీతి పార్టీ వైసీపీతో బీజేపీ చేతులు కలిపిందన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, దేశంలో తాను సీనియర్ నేతను అని, తమ పార్టీ జోలికి వచ్చిన వారికి కరెంట్ షాక్ తప్పదన్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా వివాదాల్లోకి లాగుతున్నారన్నారు. వెంకన్నతో పెట్టుకుంటే మీ పని ఖతం అన్నారు. ఆయన వద్ద నాటకాలు ఆడితే ఈ జనమ్మలోనే శిక్షిస్తారన్నారు.












Click it and Unblock the Notifications