గవర్నర్ పేరు తొలగిస్తేనే విచారణ: మంత్రులను నియంత్రించాలన్న పిటిషన్ పై హైకోర్టు
హైదరాబాద్: వేరే పార్టీ టికెట్ పై గెలిచి.. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ మంత్రి అఖిలప్రియలను బాధ్యతల నుంచి నియంత్రించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో గవర్నర్ నరసింహన్ను ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది.
గవర్నర్ ప్రతివాదిగా ఉన్న పిటిషన్లను విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గత తీర్పును ప్రస్తావించింది. ఆ మేరకు గవర్నర్ను ప్రతివాదిగా చేయడానికి వీల్లేదని తెలిపింది. కాబట్టి.. ప్రతివాదుల జాబితా నుంచి గవర్నర్ పేరు మినహాయిస్తేనే దీనిపై విచారణ జరుపుతామని వెల్లడించింది.
హైకోర్టు వాదనతో పిటిషనర్ తరుపు న్యాయవాది మల్లికార్జునశర్మ ఏకీభవించలేదు. దీంతో ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించవచ్చా? లేదా? అన్న నిర్ఱయాన్ని వాయిదా వేసింది కోర్టు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, తెలంగాణ మంత్రి తలసానిని, ఏపీ మంత్రి అఖిలప్రియను మంత్రి పదవుల బాధ్యతల నుంచి నియంత్రించాలని కోరుతూ న్యాయవాది గిన్నె మల్లేశ్వరరావు హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు.