రేణుక చౌదరితో మాటలు పడ్డ వైఎస్ షర్మిల
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెర లేచింది. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నేతలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటోన్నారు.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గ చూపుతూ వస్తోన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై అప్పుడే విమర్శల దాడి మొదలైంది. వైఎస్ఆర్టీపీని ఏ కాంగ్రెస్లో విలీనం చేయడానికి ఆమె ప్రయత్నిస్తోన్నారో.. అదే కాంగ్రెస్ నుంచి ఈ దాడి మొదలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. వైఎస్ షర్మిలపై ఘాటు విమర్శలు చేశారు. తీవ్ర ఆరోపణలను సంధించారు. ఏదైనా మాట్లాడటానికి, అడగటానికి ఆమెకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదని ఏదైనా మాట్లాడొచ్చా, ఏదైనా అడగొచ్చా? అంటూ ఎద్దేవా చేశారు.
ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానంటూ వైఎస్ షర్మిల చెప్పడాన్ని రేణుకా చౌదరి తప్పు పట్టారు. షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్ఠానం నిర్ధారిస్తుందని, సొంత నిర్ణయాలను తీసుకోవడం ఇక్కడ చెల్లదనీ అన్నారు. షర్మిల తెలంగాణ కోడలైతే.. తాను తెలంగాణ ఆడబిడ్డనని తేల్చి చెప్పారు.

వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసుకోవాలా? వద్దా? అనే విషయాన్ని ఇంకా అధిష్ఠానం తేల్చ లేదని, అప్పుడే సొంత నిర్ణయాలను తీసుకోవడం సరికాదని రేణుకా చౌదరి అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారంతేనని, పొత్తులు, విలీనం అనే విషయాలేవీ ప్రస్తావనకు రాలేదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications