సెక్షన్ 8: ఎజి సలహా మాత్రమే, అంతా గవర్నర్ చేతిలోనే...
న్యూఢిల్లీ: గవర్నర్ నరసింహన్ కోరిన మేరకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సలహా ఇచ్చారే తప్ప కేంద్రం నుంచి సెక్షన్ 8ను అమలు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయలేదని అంటున్నారు. అయితే, నిర్ణయం మాత్రం గవర్నర్ తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. నిజానికి, హైదరాబాదులో సెక్షన్ 8 అమలులోనే ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. మీడియాలో ఇందుకు సంబంధించి బుధవారం భిన్నమైన కథనాలు వచ్చాయి.
ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చిందంటేనే అందులో ఉన్న సెక్షన్-8 కూడా అమలులోకి వచ్చినట్లేనని, దీని అమలును ఇన్నాళ్ళూ నిలిపివేయడమో లేక ఇకపైన విడిగా దీన్ని అమలు చేయడమో ఉండదని కేంద్ర హోంశాఖ వర్గాలు స్పష్టం చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీని అమలు గురించి గవర్నర్కు విడిగా సూచించడమో లేక ఆదేశించడమో కూడా ఉండదని అన్నారు. చట్టం అమలవుతున్న క్రమంలో సెక్షన్-8 గురించి గవర్నర్కు స్పష్టత ఉన్నదని తెలిపారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాదులో చట్టబద్ధంగా నివసిస్తున్నవారందరి రక్షణకు ఈ సెక్షన్ గ్యారంటీ ఇస్తుంది గానీ చట్ట విరుద్ధమైన చర్యలకో, అసాంఘిక కార్యకలాపాలకో దీని ద్వారా స్వేచ్ఛను, భద్రతను కోరుకునే అంశమే ఉత్పన్నం కాదని అంటున్నారు. ఉదాహరణకు, ఏపీకి చెందినవారు ఏదైనా నేరానికి పాల్పడి ఈ సెక్షన్ను అడ్డుపెట్టుకుని తమపైన తెలంగాణవారు దాడి చేశారనో, తమకు రక్షణ లేకుండా పోయిందనో వ్యాఖ్యానిస్తే అలాంటివారికి భద్రత కల్పించబోదని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు అన్నట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక రాసింది
శాంతిభద్రతలు అదుపు తప్పినప్పుడు సహజంగానే గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తారని, సంబంధిత అధికారులనుంచి వివరాలు సేకరిస్తారని, తెలంగాణ మంత్రిమండలిని సంప్రదిస్తారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను అదుపు చేయడంలో సరైన తీరులో వ్యవహరించలేదని గవర్నర్ భావించినప్పుడు మాత్రమే జోక్యం చేసుకుంటారు తప్ప నేరుగా శాంతిభద్రతలను స్వయంగా గవర్నరే తన చేతుల్లోకి తీసుకోవడాన్ని సెక్షన్ 8 అనుమతించదు.
పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8 ప్రకారం గవర్నర్కు దఖలుపర్చిన బాధ్యతలను ఎప్పుడు అమలు చేయాలన్నదానిపై గవర్నర్ స్వయంగా నిర్ణయం తీసుకుంటారు తప్ప కేంద్ర హోంశాఖనుంచి ఆదేశాలు వెళ్ళబోవని హంశాఖ ఉన్నతాధికారి చెప్పినట్లు నమస్తే తెలంగాణ రాసింది.