మద్యం దుకాణాల కేటాయింపులో ఎస్సీ,ఎస్టీ,గౌడ్స్కు రిజర్వేషన్లు... ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలోని మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. 2021-23 సంవత్సరాలకు ఈ రిజర్వేషన్లు అమలులో ఉంటాయి.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం (సెప్టెంబర్ 21) ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆ పథకం కింద ఇచ్చే నిధులతో దళితులు వ్యాపార రంగంలో నిలదొక్కుకునేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇందులో భాగంగానే తాజాగా మద్యం దుకాణాల్లో వారికి రిజర్వేషన్లు కేటాయించింది.

మెడికల్ షాపులు,మీసేవా కేంద్రాలు,గ్యాస్ డీలర్షిప్స్,ఫర్టిలైజర్ షాపులు,ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్,మైనింగ్ లీజులు,సివిల్ కాంట్రాక్టర్స్,ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్,బార్ షాపులు,వైన్ షాపులు తదితర రంగాల్లో దళితులు నిలదొక్కుకునేలా చర్యలు తీసుకోవాలని ఇటీవలి కేబినెట్లో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ మహాశయుడు అంబేడ్కర్ అందించిన ఫలాలు తప్పితే దళితుల జీవితాల్లో ఇప్పటికీ గుణాత్మకమైన మార్పు రాలేదన్నారు. దళితబంధు పథకం... మొదటి దశలో పథకం అమలు పటిష్టంగా జరగాలన్నారు. రెండో దశలో పథకం పర్యవేక్షణ కీలకమని అన్నారు. జిల్లా కలెక్టర్లు, దళితబంధు కమిటీలు దీనికోసం సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి లబ్ధిదారుని కుటుంబానికి ప్రత్యేక దళితబందు బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
దళిత బంధు అమలు,పర్యవేక్షణ కోసం గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కమిటీలు ఉంటాయని సీఎం పేర్కొన్నారు.కమిటీల్లో దళిత బిడ్డలే ఉంటారని... ఆ జాతి అభివృద్ధికి వారినే స్వయంగా భాగాస్వాములను చేయడం ఈ పథకం గొప్పతనమని అన్నారు. ఈ కమిటీల నుంచి ఎన్నిక కాబడిన వారే రీసోర్స్ పర్సన్స్గా ఉంటారని చెప్పారు. ఆశావహ దృక్పథానికి బాటలు వేస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదని అన్నారు. అగ్రకులాల్లోని పేదల అభివృద్దికి సైతం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఒక్కొక్క రంగాన్ని వర్గాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నరాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు దళితుల అభ్యున్నతే లక్ష్యంగా చర్యలు చేపడుతోందన్నారు. అందులో భాగంగానే దళితబంధు అమలుకోసం ప్రయోగాత్మకంగా నాలుగు మండలాలను ఎంపిక చేశామన్నారు.దళిత జాతి అభివృద్ధిలో మీరు చాలా గొప్ప పాత్ర పోషించాలని.. పోషిస్తారని ఆశిస్తున్నానంటూ ఆ నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్రంలోని మరో 4 మండలాలను ఈ పథకం కోసం ఎంపిక చేశారు. వీటిలో చింతకాని మండలం ( మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా ),తిరుమలగిరి మండలం ( తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట జిల్లా ),చారగొండ మండలం ( అచ్చంపేట నియోజకవర్గం, నాగర్కర్నూల్ జిల్లా )
నిజాం సాగర్ మండలం ( జుక్కల్ నియోజకవర్గం, కామారెడ్డి జిల్లా ) ఉన్నాయి.త్వరలోనే ఈ మండలాల్లోని అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలుచేయనున్నారు.












Click it and Unblock the Notifications