దమ్ముంటే రాజీనామా చెయ్.. నేనూ బీసీ బిడ్డనే.. నీకంటే ఆత్మగౌరవం ఎక్కువే : ఈటలకు గంగుల సవాల్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గమైన హుజురాబాద్ కేంద్రంగా రాజకీయం హీటెక్కుతోంది. ఈటల రాజకీయ పునాదులను పెకిలించేందుకు టీఆర్ఎస్ 'ఆపరేషన్ హుజురాబాద్'ను చేపడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల అధిష్ఠానం ఆదేశాల మేరకు హుజురాబాద్లో మకాం వేసి ఈటలను రాజకీయంగా బలహీనపర్చే వ్యూహాలు అమలుచేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఈటల.. మంత్రి గంగులపై కూడా ఘాటైన విమర్శలు చేశారు. దీంతో గంగుల కూడా ఈటలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

దమ్ముంటే రాజీనామా చెయ్ : మంత్రి గంగుల
ఈటల రాజేందర్కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. పదవుల కోసం పెదవులు మూయను అని చెప్పిన ఈటల... కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినా ఎమ్మెల్యే పదవిని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారని ఆక్షేపించారు. హుజురాబాద్ ప్రజలు ఈటల వెంటే ఉంటే... ఆయన రాజీనామా ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. ఇది ఆత్మగౌరవమా లేక ఆత్మ వంచనా అని ప్రశ్నించారు.

మంత్రి అయ్యాక వాటిని ఎందుకు ఆపలేదు : గంగుల
కరీంనగర్లో గుట్టలు మాయం చేసి బొందలగడ్డగా మార్చారని తనపై ఈటల చేసిన పరోక్ష ఆరోపణలపై గంగుల ఫైర్ అయ్యారు. తనపై ఆరోపణలు,విమర్శలు సరికాదన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోనూ గ్రానైట్ పరిశ్రమలు నడుస్తున్నాయని... ఈటల మంత్రి అయ్యాక వాటిని ఎందుకు ఆపే ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో ఈటల కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు. అక్కడ తమిళనాడు వాసులు గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తున్నారని... దానిపై ఎందుకు మాట్లాడట్లేదని మండిపడ్డారు.

నాకున్నది ఒక్కటే క్వారీ : గంగుల
కరీంనగర్లో 350 గ్రానైట్ క్వారీలు ఉంటే.. గంగుల కమలాకర్కు ఒక్కటే గ్రానైట్ క్వారీ ఉందన్నారు. ఆ ఒక్క క్వారీ తాను రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఉందన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. తాను ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టినట్లు ఆరోపణలు చేస్తున్నారని... అది నిరూపిస్తే అంతకు ఐదు రెట్లు అధికంగా చెల్లించేందుకు తాను సిద్దమని తెలిపారు. అసైన్డ్ భూముల విషయంలో ఈటల దోషిగా తేలారని... సిగ్గుంటే ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని డిమండ్ చేశారు.

నేనూ బీసీ బిడ్డనే... : గంగుల
తాను కూడా బీసీ బిడ్డనే అని... ఈటల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని గంగుల అన్నారు.ఈటల కంటే తనకు ఆత్మగౌరవం ఎక్కువ అని... ఇన్నాళ్లు పార్టీలో ఉన్నందునే ఆయన్ను గౌరవించామని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కార్యకర్తలను కొనుగోలు చేసేందుకు ఈటల ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈటల ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్లో పార్టీని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications