నన్ను దించాలనేదే ఆ నలుగురి లక్ష్యం - నా ఫోన్లు రికార్డు చేస్తున్నారు: రేవంత్..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక అంశాలను బయట పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ లో నలుగురైదుగురి అభిప్రాయాలు ఎప్పుడూ మారవన్నారు. తనను దించి కుర్చీలో కూర్చోవాలనుకున్నది వారి లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నిరంతరం ఫోన్లను వాచ్ చేస్తోందని ఆరోపించారు. తన పార్టీ నేతలే తనతో మాట్లాడి దానిని రికార్డు చేసుకొని ఇతరులకు వినిపిస్తున్నారని చెప్పారు.
పార్టీలో అన్ని పదవులూ అనుభవించిన వారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ట్రస్టుకు సంబంధించి కోట్లాది రూపాయలను మర్రి శశిధర్రెడ్డి స్వాహా చేశారన్నారు. సొంత పార్టీలో పరిస్థితుల్లో పైన టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
నలుగురైదుగురు సీనియర్లు మినహా...
కాంగ్రెస్ పార్టీలో నలుగురైదుగురు సీనియర్లు మినహా మిగిలిన నేతలంతా తన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ చెప్పారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో రేవంత్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పీసీసీ కుర్చీలో కూర్చోవాలనుకుంటున్న వారు మాత్రమే తనను వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికల ఫలితాల ఆధారంగా తన పనితీరు..పార్టీ పని తీరు నిర్ణయించలేమని చెప్పారు. ఏది జరిగినా పీసీసీ అధ్యక్షుడిగా నాదే బాధ్యత కావచ్చుగానీ, అందరు చేసిందే నిర్ణయం అయినప్పుడు ఫలితం తేడాగా వస్తే మాత్రం పీసీసీ అధ్యక్షుడే విఫలమయ్యారని చెప్పుకొచ్చారు.
ఇవన్నీ కుర్చీలో కూర్చోవాలనుకునేవారు చేసే ఆరోపణలేనని రేవంత్ విశ్లేషించారు. ఏఐసీసీ స్థాయిలో కూడా అన్ని పదవులు అనుభవించిన గులాంనబీ ఆజాద్ లాంటి వారే నాయకత్వాన్ని విమర్శించారని గుర్తు చేసారు. తాను అందరితోనూ మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రతి శనివారం గాంధీభవన్లో అందరితో చర్చించి.. అక్కడ నిర్ణయించిన కార్యక్రమాలతోనే ముందుకు వెళుతున్నానని వివరించారు. ఆ సమావేశానికి రాకుండా, తీర్మానాలను తెలుసుకోకుండా తమను సంప్రదించడం లేదంటే ఎలా అంటూ రేవంత్ ప్రశ్నించారు.
శశిధర్రెడ్డి కోట్లాది రూపాయాలు స్వాహా చేసారు..
కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డికి సంబంధించి పలు అంశాలను రేవంత్ బయట పెట్టారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఆయన రోడ్డెక్కారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు క్యాన్సర్ వచ్చిందంటున్న శశిధర్ రెడ్డికే ఎయిడ్స్ వచ్చిందంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. తనకు పీసీసీ పదవి ఇప్పించమని శశిధర్ కోరారని రేవంత్ చెప్పారు. తాను చెబితే పదవి ఇచ్చే పరిస్థితులు ఢిల్లీలో లేవని చెప్పానని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీకి.. కోటీలో నగర కాంగ్రెస్ పేరిట మంచి ఆస్తులున్నాయన్నారుశశిధర్రెడ్డి ఈ ట్రస్టులో కీలక బాధ్యతలో ఉన్నారు. రాష్ట్రాల వారీగా ఉన్న ఆస్తులపై పీసీసీ నుంచి ఒక కమిటీ వేసి.. అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఒక వ్యక్తి కాకుండా పీసీసీయే వాటిని నిర్వహించాలని ఢిల్లీ నుంచి పార్టీ కోశాధికారి లేఖలు రాశారని వివరించరారు. దీనిపై తాను శశిధర్రెడ్డిని అయిదారు సార్లు పిలిచి అడిగాని, దీనితో ఆయన భయభ్రాంతుడై లెక్కలు చెప్పాల్సి వస్తుందని.. పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారని రేవంత్ వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందన్నారు.
కాన్ఫరెన్స్లో పెట్టి అతడి గురించి నాతో నెగటివ్గా...
ఒక సీనియర్ నాయకుడు తనకు తెలియకుండా తన ఫోన్ను మరో నేతతో కాన్ఫరెన్స్లో పెట్టి అతడి గురించి తనతో నెగటివ్గా మాట్లాడారని రేవంత్ చెప్పుకొచ్చారు. అదృష్టం బాగుండి తాను ఆయనతో ఏకీభవించలేదన్నారు. తాను ఫోన్ పెట్టేసిన రెండు నిమిషాలకు కాన్ఫరెన్స్లో ఉన్న వ్యక్తి తనకు ఆ విషయం చెప్పారని రేవంత్ వివరించారు.
డిసెంబరు తొలివారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లు ప్రకటిస్తారని రేవంత్ చెప్పారు. తెలంగాణలో 30 మంది సీనియర్ నాయకులున్నారన్నారు. అందులో నలుగురైదుగురు తప్ప.. మిగతా సీనియర్లు తనను ఒప్పుకుంటున్నారని చెప్పారు. తనను దించి కుర్చీలో కూర్చోవాలనుకున్న తర్వాత వారెలా మారతారని రేవంత్ ప్రశ్నించారు.