ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సొంత స్థలం ఉన్న అర్హులకు మూడు విడతలలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటునందిస్తుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది.
ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు లేని వారికి శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీ నాటికి సుమారు 1.12 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు చేయించాలని లక్ష్యం పెట్టుకుంది. అంతేకాదు జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇళ్ల స్థలం ఉన్నవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు, ఇళ్ల స్థలం లేనివారికి అపార్ట్మెంట్లు నిర్మించి ఫ్లాట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ప్లాన్
ఈ క్రమంలో రాష్ట్ర హౌసింగ్ శాఖ అధికారులు ఇప్పటికే అనేక ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎల్ 2 కేటగిరి దరఖాస్తులపైన ప్రత్యేక దృష్టి సారించింది. ఎల్2 అంటే సొంత స్థలం లేని నిరుపేదలు, ఈ వర్గానికి భూములు కేటాయించి ఇల్లు నిర్మించి ఇచ్చే బదులు, బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మించి వారికి ప్లాట్లను కేటాయించాలని నిర్ణయించిన రేవంత్ ప్రభుత్వం అందుకు ప్లాన్ చేస్తోంది.
హైదరాబాద్ లో మాత్రమే కాదు అన్ని జిల్లా కేంద్రాలలో కూడా
హైదరాబాద్లో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేసి నిర్మాణం చేపడుతున్నారు. వీటిని ప్రధానంగా మూడు, ఐదు, తొమ్మిది అంతస్తుల ఎత్తులో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ 415 చదరపు అడుగుల విస్తీర్ణం నుండి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.
బహుళ అంతస్తుల భవనాల ప్లాన్ ఇలా
ఒక ఎకరం విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టే జి ప్లస్ త్రీ అపార్ట్మెంట్లో 120 నుండి 150ఫ్లాట్లు, స్టిల్ట్+5 అపార్ట్మెంట్లో 150-200ఫ్లాట్లు, అలాగే స్టిల్ట్+9 అంతస్తులలో 200-220ఫ్లాట్లను నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది . ఈ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే విస్తృత దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఐదు మురికివాడలు, వాంబే, ఈడబ్ల్యూఎస్ పథకాల కింద నిర్మించవలసిన శిథిలావస్థకు చేరిన 12 కాలనీలను అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ పరిధిలో ఈ ప్రాంతాలలో ప్రభుత్వ భూములు
హైదరాబాద్కు సమీపంలోని మేడ్చల్ జిల్లాలో కూడా 28 ప్రభుత్వ భూములను పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఇక్రిశాట్ వద్ద 5 ఎకరాలు, మార్క్స్ నగర్ వద్ద 6 ఎకరాలు, లక్డారంలో 130 ఎకరాలు ఇలా పలు ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ స్థలాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విధానాన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ జిల్లాలలోనూ అపార్ట్ మెంట్ ల నిర్మాణానికి ప్లాన్
నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి ముఖ్యమైన జిల్లా కేంద్రాల్లోనూ ఈ తరహా అపార్ట్మెంట్లు నిర్మించి పేదలకు గృహాలను అందించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. స్టిల్ట్ పద్ధతిలో నిర్మించే బహుళ అంతస్తుల భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాంటి నివాసాలకు అనుమతి ఉండదు. ఈ అంతస్తులో కేవలం పార్కింగ్, వాణిజ్య సముదాయాల గదులను మాత్రమే కేటాయించనున్నారు.
జిల్లాలలో స్థలాల గుర్తింపు వేగం
జీ+3 విధానంలో నిర్మించే అపార్ట్మెంట్లకు మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో నివాసయోగ్యమైన గృహాలకు అనుమతి ఉంటుంది. ప్రస్తుత ఈ బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడానికి రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కేంద్రాలలో అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి నివేదికల సమర్పించాలని ఇప్పటికే ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. మొత్తానికి ఎల్ టు కేటగిరి కింద బహుళ అంతస్తుల భవనాలను కూడా నిర్మాణం చేసి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు లేకుండా చూడాలని ప్రయత్నం చేస్తుంది.












Click it and Unblock the Notifications