కొత్త నియోజకవర్గం నుంచి రేవంత్ పోటీ - సీనియర్లు సైతం : సునీల్ కనుగోలు కొత్త లెక్కలు..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ కొడంగల్ వదిలేస్తున్నారా. వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గం ఎంచుకున్నారా. రేవంత్ తో పాటుగా నియోజకవర్గాలు మారే నేతలు ఎవరు. ఎమ్మెల్యే అభ్యర్ధులు కొందరు ఎంపీలుగా.. లోక్ సభకు గతంలో పోటీ చేసిన వారు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్న సునీల్ కనుగోలు కొత్త సమీకరణాలు తర మీదకు తీసుకొస్తున్నారు. ఏ లోక్ సభ స్థానం నుంచి ఎవరికి అవకాశం ఇవ్వాలి.. ఎవరిని ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే పార్టీకి ప్రమోజనం కలుగుతుందనే అంశాల ఆధారంగా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సర్వేలకు అనుగుణంగా నిర్ణయాలు
దీంతో.. కొందరు సీనయర్లు తమ ఆలోచనలు పార్టీ ముఖ్య నేతలతో షేర్ చేసుకుంటున్నారు. దీంతో..ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో నేతల నియోజకవర్గాల మార్పు అంశం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. కొందరు సీనియర్లు తమ వారసుల భవిష్యత్ కోసం కొత్త ప్రతిపాదనలతో మంతనాలు ప్రారంభించారు. పార్టీ సీనియర్ నేత జానారెడ్డి 2018 ఎన్నికల్లో.. గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయారు. దీంతో..ఆయన ఈ సారి నల్గొండ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి ఈసారి హుజూర్నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైంది.

ఎంపీలు - ఎమ్మెల్యేల స్థానాలు మార్పు
తనకు పాలకుర్తి కాకుండా జనగామ లేదా వరంగల్ (వెస్ట్) ఇవ్వాలని జంగా రాఘవరెడ్డి కోరుతుండగా.. తాను పరకాల నుంచి కాకుండా వరంగల్ (ఈస్ట్) నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి సురేఖ చెప్తున్నారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ కూడా నిజామాబాద్ లోక్సభకు కాకుండా గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ ..మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇప్పటి వరకు ఆందోల్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఇక, ఈ సారి జహీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ మాజీ మంత్రి గీతారెడ్డి నియోజకవర్గం కావటంతో ఇప్పుడు దీని పైన చర్చ మొదలైంది.

రేవంత్ ఇక కొత్త నియోజకవర్గం నుంచి
దీంతో..గీతారెడ్డిని కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేయించేలా ఒప్పించాలనేది దామోదర రాజ నర్సింహ ఆలోచనగా తెలుస్తోంది. మాజీ ఎంపీ మల్లు రవి జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా కాకుండా.. నాగర్ కర్నూల్ లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ పేరు సైతం ఉంది. ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి..ఆ లోక్ సభ పరిధిలోని ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసే ప్రతిపాదన పైన సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. కొడంగల్లో తన సోదరుడు తిరుపతిరెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది. ఎల్బీ నగర్ లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సెటిలర్ల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. దీంతో..ఆ నియోజకవర్గం తనకు అనుకూలంగా ఉంటుందని రేవంత్ భావిస్తున్నారు. ఈ మొత్తం మార్పులు చేర్పుల పైన పూర్తి స్థాయిలో చర్చలు - సంప్రదింపులు పూర్తి చేసి.. త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications