ప్లాన్తో బాబుపై ఇలా, రేవంత్ వ్యూహాత్మక అడుగులు: మరో బాంబు పేలుస్తారా?
టిడిఎల్పీ హోదాలో శాసన సభా పక్ష సమావేశాన్ని నిర్వహిస్తానని గట్టిగా చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత వెనక్కి తగ్గారు. అయితే ఆయన నిజంగానే వెనక్కి తగ్గారా? అంటే అలా తగ్గి మరింత దూకుడు పెంచారు.
హైదరాబాద్: టిడిఎల్పీ హోదాలో శాసన సభా పక్ష సమావేశాన్ని నిర్వహిస్తానని గట్టిగా చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత వెనక్కి తగ్గారు. అయితే ఆయన నిజంగానే వెనక్కి తగ్గారా? అంటే అలా తగ్గి మరింత దూకుడు పెంచారు.
రేవంత్ రెడ్డి రూటే సపరేటు!: కాంగ్రెస్లోకి ఎందుకు, ఇవీ కారణాలు
కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగిన ప్రారంభంలో ఆయన ఏపీ టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ తెలంగాణ టిడిపి నేతలపై మాట్లాడలేదు. కానీ తనను పదవుల నుంచి తప్పించారని తెలిసి భగ్గుమన్నారు.
రేవంత్ రెడ్డి ఇష్యూ: సూపర్.. రమణకు బాబు ప్రశంసలు, దేనికి సంకేతం
వ్యూహాత్మకంగా ఎదురుతిరుగుతున్న రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైందని అందరూ భావిస్తున్నారు. టిడిపికి కూడా అది అర్థమైంది. ఈ నేపథ్యంలో ఆయన కదలికలను బట్టి టిడిపి అధిష్టానం ముందుకు సాగుతోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నారు. ఆయన తీరు చూస్తుంటే వేటుపడటం ఖాయమని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని భావిస్తున్నారు.
ఏపీ టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు, బాబు మౌనం
రేవంత్ రెడ్డి ప్రారంభంలో ఏపీ టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వారికి వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిందని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు ఇప్పటి దాకా మౌనంగానే ఉన్నారు. కానీ సంబంధిత నేతలు మాత్రం ఒకరిద్దరు స్పందించారు.
చంద్రబాబుపై ఇంకా గౌరవాన్ని చూపిస్తూ
అయితే, తెలంగాణ టిడిపి నేతలు తనపై మాటల దాడి ప్రారంభించడంతో రేవంత్ రెడ్డి అంతే దూకుడుగా స్పందిస్తున్నారు. అంతేకాదు తన చేతల్లో ఇంకా చంద్రబాబుపై గౌరవాన్ని చూపిస్తున్నారు. తద్వారా తన ఆగ్రహం, ఆవేదన అంతా తెలంగాణ టిడిపి.. కేసీఆర్తో కలవాలనుకోవడమేననే అభిప్రాయం ఆయన మాటలు, చేతల్లో కనిపిస్తోంది.
వ్యూహాత్మకం.. టిటిడిపి స్పందించాక దూకుడు
కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తొలుత కేసీఆర్ ప్రభుత్వం ఏపీ టీడీపీ నేతలకు కాంట్రాక్టులు ఇచ్చిందని ఆరోపించి ఇరకాటంలోపడేసే ప్రయత్నాలు చేశారు. కానీ తెలంగాణ టిడిపి నేతలు తనపై స్పందించిన తర్వాతనే ఆయన మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు.
దూకుడు, తగ్గినట్లే తగ్గి
రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని భావిస్తున్న టి-టిడిపి నాలుగైదు రోజులుగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయన విషయమై చంద్రబాబుకు లేఖ రాసి, పదవులను తొలగించారు ఎల్ రమణ. టిడిఎల్పీ సమావేశం నిర్వహించవద్దని ఆదేశించారు. కానీ రేవంత్ మాత్రం తగ్గలేదు. శాసన సభా పక్షంలో జోక్యం చేసుకునే అవసరం లేదని రమణకు కౌంటర్ ఇచ్చారు. కానీ గురువారానికి టిడిఎల్పీ భేటీ సమయానికి ఆయన తగ్గారు. ఈ తగ్గడం కూడా ప్లాన్ ప్రకారమే అంటున్నారు.
చంద్రబాబుపై గౌరవం చూపిస్తున్నారు
సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి మేరకు రేవంత్ తగ్గినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ పదవుల నుంచి తనను తొలగించాలని చంద్రబాబు ఆదేశించారని చెప్పినందున... ఆయనపై గౌరవం ఉందని చెప్పేందుకు కూడా టిడిఎల్పీ భేటీపై పట్టు విడిచారని అంటున్నారు. అంతేకాదు, చంద్రబాబు వచ్చాక అన్నీ చెబుతానని చెప్పానని, అప్పటి దాకా ఆగే ఓపిక లేదా అని రేవంత్ టిటిడిపి నేతలను నిలదీస్తున్నారు.
అసెంబ్లీలో ఆసక్తికర సంఘటనలు
తనను పదవి నుంచి తొలగించారని చంద్రబాబు ఆదేశించినట్లు ఎల్ రమణ చెప్పినందున రేవంత్ రెడ్డి గురువారం అసెంబ్లీలో టిడిపికి కేటాయించిన కార్యాలయానికి వెళ్లారు. తనకు కేటాయించిన సీట్లో కాకుండా పక్క సీట్లో కూర్చున్నారు. తద్వారా పదవులను తొలగించిన అంశంపై మౌనంగా ఉన్నారు. అసెంబ్లీలో ఎదురుపడ్డ కాంగ్రెస్ నేతలు ఆయనను ఆలింగనం చేసుకోవడం గమనార్హం.
దిమ్మతిరిగే ప్రశ్నలు సంధించారు
పార్టీ పదవుల విషయంలో, టిడిఎల్పీ భేటీ విషయంలో రేవంత్ రెడ్డి తగ్గారు. కానీ తెలంగాణ టిడిపి నేతలపై మాత్రం ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆ పార్టీ నేతలు చెబితే ప్రశ్నించడం, ఢిల్లీలో రాహుల్ గాంధీతో కలయికపై నిలదీయడంపై టిడిపికి దిమ్మతిరిగే ప్రశ్నలు సంధించారు.
రమణా! వీటికి సమాధానాలు చెప్పావా?
గతంలో తెరాసలో చేరిన ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ తెలంగాణ టిడిపి చీఫ్ ఎల్ రమణ సహా పలువురు నేతలు మా వైపు ఉన్నారని చెప్పారని, దీని గురించి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా అని రమణను నిలదీశారు. కాంగ్రెస్ నేతలను కలిస్తే విమర్శలు చేయడంపై స్పందిస్తూ.. నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్తో కలిసి రమణ ఢిల్లీ వెళ్లలేదా అని నిలదీశారు.
టిడిపి లేదన్న బిజెపి కావాల్సి వచ్చిందా
బిజెపితో కలిసి గోల్కొండ హోటల్లో భేటీ నిర్వహించడంపై కూడా ఘాటుగా స్పందించారు. తెలంగాణలో టిడిపి లేనే లేదని ఆ పార్టీ నేత మురళీధరరావు సహా పలువురు వ్యాఖ్యానించారని, అలాంటి కమలం పార్టీతో ఎలా కలుస్తారని నిలదీశారు.
అందరి బాగోతం బయటపెడతారా, మరో బాంబు పేలుస్తారా?
ఇప్పటికే ఏపీ టీడీపీ నేతలపై ఆరోపణల బాంబు పేల్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ టిడిపి నేతల పైన కూడా పేల్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేసీఆర్ - టిడిపి అంటకాగడమే రేవంత్ రెడ్డికి మంట పుట్టిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ టిడిపి నేతలు.. కేసీఆర్తో అంటకాగడం వెనుక కారణాలను బట్టబయలు చేసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చాక, ఆయనను కలిసిన తర్వాత అందరి బాగోతాలు బయటపెడతానని రేవంత్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట. తనను తీవ్రపదజాలంతో కొందర దూషించినా రమణ స్పందించలేదని, కేడర్ను చూస్తే బాధేస్తోందని రేవంత్ అన్నారు.