రేవంత్ బెయిల్ పిటిషన్ వాయిదా, తెలంగాణ వద్ద కీలక సమాచారం!
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. బుధవారం నాడు రేవంత్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రం వాదనలు వినిపించేందుకు కొంత సమయం కోరారు. అదనపు కౌంటర్ దాఖలుకు తెలంగాణ ఏసీబీ సమయం కోరింది. దీంతో బెయిల్ పిటిషన్ పైన విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
రేవంత్కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని ఏసీబీ చెప్పింది. కాగా, ఓటుకు నోటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వద్ద కీలక ఆధారాలున్నాయని, అందుకే అనుబంధ కౌంటర్ వేస్తానని చెప్పిందని అంటున్నారు. ఆ కీలక సమాచారం ఏమిటనే చర్చ సాగుతోంది.
ఇదిలా ఉండగా, ఆడియో, వీడియో టేపులపై, మొబైల్ ఫోన్ సంభాషణలపై ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక బుధవారంనాడే అందే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. నోటుకు ఓటు కేసులో నాలుగో నిందితుడు జెరూసెలం మత్తయ్య అరెస్టుపై స్టే కూడా ఈ రోజే ముగియనుంది.